స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్: ఎయిమ్స్లో అడ్మిట్: ఆయన ఆరోగ్యంపై బులెటిన్ ఇదే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకెండ్ వేవ్ ఆరంభమైనట్టే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఆదివారం నాడు సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. పంజాబ్, గుజరాత్లోని పలు నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఈ నెలాఖరు వరకు సెలవులను ప్రకటించారు. కర్ణాటక కూడా అదే బాటలో నడిచే పరిస్థితి ఏర్పడింది. దేశ రాజధానిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెయ్యి వరకు నమోదవుతున్నాయి. మరోమారు రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా- లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా వైరస్ సోకింది. ఈ నెల 19వ తేదీన ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. శనివారం ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో అడ్మిట్ అయ్యారు. ఎయిమ్స్లోని కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని ఎయిమ్స్ తెలిపింది. ఈ మేరకు ఎయిమ్స్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఆర్తీ విజ్ కొద్దిసేపటి కిందటే ఓ బులెటిన్ విడుదల చేశారు.
కొద్దిరోజుల కిందటే ఆయన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద పార్లమెంట్ హౌస్లో హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు లోక్సభ సభ్యులు, సిబ్బంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఓం బిర్లాను కలిసిన వారికి పరీక్షలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఓం బిర్లాను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకోవాలని ఎయిమ్స్ డాక్టర్లు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 813 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం అక్కడి తీవ్రతను చాటుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక శాతాన్ని దాటుకుంది. మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉంటోంది. ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్యయ 10,955కు చేరింది.