లోక్ సభ ఎంపీపై అనర్హత వేటు- సెక్రటేరియట్ సంచలన నిర్ణయం..!
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ పై ఇవాళ లోక్ సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2009 నాటి హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ తాజాగా కవరత్తిలోని స్ధానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారణ అయితే అనర్హత వేటు వేయాలన్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం ఫైజల్ పై వేటు వేస్తూ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ విధించిన ఆంక్షలపై గట్టిగా పోరాడిన ఎంపీ ఫైజల్ పై కేంద్రం గుర్రుగా ఉంది. ఎన్సీపీకి చెందిన ఫైజల్ పై ఇప్పటికే అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. స్ధానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే సదరు ఆంక్షల విషయంలో గవర్నర్ తో హోరాహోరీగా పోరాడారు. ఇదే క్రమంలో ఆయనపై కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పలు ఫిర్యాదులు కూడా చేశారు. చివరికి 2009 నాటి ఓ కేసును తవ్వి ఫైజల్ పై అభియోగాలు నమోదు చేశారు. వీటిని స్ధానిక కోర్టు నిర్ధారించడంతో ఆయన జైలుకెళ్లారు.
ఈ నేపథ్యంలో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్పై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 11 బుధవారం నుండి ఇది అమలులోకి వచ్చినట్లు సచివాలయం పేర్కొంది. 2009 నాటి హత్యాయత్నం కేసులో లక్షద్వీప్లోని కవరత్తికి చెందిన సెషన్స్ కోర్టు ఫైజల్ పై 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత ఫైజల్తో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించి కన్నూర్ సెంట్రల్ జైలుకు పంపారు. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రేరేపిత దాడిగా పేర్కొంటూ ఫైజల్ పై హత్యా నేరం మోపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు వేసే అవకాశముంది.