శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: మసీదు తొగింపుపై 30 నుంచి మధుర కోర్టులో విచారణ - అసదుద్దీన్ అభ్యంతరం
అయోధ్యలో రామ జన్మభూమి వివాదంలో హిందూ పక్షానికి అనుకూలంగా తీర్పు రావడం, ఆలయ నిర్మాణానికి భూమి పూజ కూడా జరిగిన తర్వత.. ఉత్తరప్రదేశ్ లోనే శ్రీకృష్ణ జన్మభూమి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధంచి మధుర సివిల్ కోర్టు సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద స్థలం నుంచి మసీదును తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 30 నుంచి వాదోపవాదాలు వింటానని జడ్జి ఛాయ శర్మ పేర్కొన్నారు.

నాటి తీర్పును కొట్టేయండి..
నిజానికి 1968 అక్టోబర్లో శ్రీకృష్ణ జనమ్మభూమి వివాదం పరిష్కారం కాగా.. నాటి తీర్పులు కొట్టేయాలని, వివాదాస్పద స్థలంలో మసీదును తొలగించి, ఆ భూమినంత హిందువులకు అప్పగించాలని శ్రీకృష్ణ విరాజ్మాన్(భగవంతుడి) తరఫున ఐదుగురు వ్యక్తులు పిటిషన్ వేశారు. వారిలో లక్నోకు చెందిన రంజనా అగ్నిహోత్రి, ఢిల్లీకి చెందిన పర్వేష్ కుమార్, యూపీ సిద్ధార్థ నగర్ కు చెందిన రాజేశ్ మణి త్రిపాఠి, బస్తీకి చెందిన కరుణేశ్ కుమార్ శుక్లా, లక్నోకే చెందిన శివాజి సింగ్, త్రిపురారి తివారి ఉన్నారు. పిటిషనర్ల తరఫున ప్రముఖ అడ్వొకేట్ విష్ణు జైన్ వాదనలు వినిపించారు.

పిటిషన్ లో ఏముందంటే..
పవిత్ర నగరమైన మధురలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిధిలోని 13.37 ఎకరాల ప్రాంగణంలోనే శ్రీ కృష్ణుడి జన్మస్థలం ఉందని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు 1669-70లో హిందువులకు చెందిన స్థంలో మసీదును నిర్మించారని, సదరు మసీదును వెంటనే తొలగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు. అంతేకాదు, కృష్ణ జన్మస్థలం వివాదానికి సంబంధించి 1968లో ఇదే మధుర సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాయాలని, శ్రీకృష్ణ జన్మస్ధాన్ సేవా సంఘ్, షాహి ఈద్గా ట్రస్ట్ మధ్య నాడు కుదిరిన రాజీ ఒప్పందం సరికాదని గుర్తించాలంటూ పిటిషన్ లో కోరారు. కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాలను అప్పగించాలని, 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణకు ముందే ఈ పిటిషన్ వివాదాస్పదం అయినప్పటికీ.. దానిని కోర్టు స్వీకరించడం గమనార్హం.

పురోహిత్ మహాసభ అభ్యంతరం..
మధులలో చరిత్ర పొడువునా మందిరం, మసీదు వివాదం లేదని, అలాంటిది కొందరు వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా పిటిషన్లు వేయడం ఖండనీయమని ‘అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ' వ్యాఖ్యానించింది. ప్రశాంతంగా, మతసామరస్యంతో మెలిగే మధురలో చిచ్చు పెట్టేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ పాఠక్ అన్నారు. ఇదే అంశంపై యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తులు తమ అభిప్రాయాలు చెప్పుకునే వీలున్నప్పటికీ.. కోర్టులు, రాజ్యాంగం ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
Recommended Video

అసదుద్దీన్ ఓవైసీ మండిపాటు..
1968లోనే కోర్టు ద్వారా పరిష్కారమైన శ్రీకృష్ణ జన్మభూమి వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం పట్ల ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మస్ధాన్ సేవా సంఘ్, షాహి ఈద్గా ట్రస్ట్ మధ్య తలెత్తిన వివాదం 1968లో పరిష్కారమైందని, నాటి తీర్పును కొట్టేసి, మసీదును తొలగించాలనడం చట్టవిరుద్ధమని, ప్రార్థనా స్ధలాల చట్టం 1991 ప్రార్ధనా స్థలాల మార్పిడిని నిరోధిస్తుందని, ఈ చట్టం అమలు బాధ్యత హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారని ఓవైసీ గుర్తుచేశారు. తాజా వివాదంపై కోర్టులో ప్రభుత్వ స్పందనే కీలకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications