నోట్ల రద్దు ఎఫెక్ట్: ఆలయానికి రూ 44 లక్షలు విరాళం
చెన్నై/వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లాలోని శ్రీ జలకందేశ్వరర్ అనే ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు భారీ విరాళాలు ఇచ్చారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు కావడంతో ఎన్నడు లేని విధంగా రూ. 44,00,500 విరాళాలు ఇవ్వడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చెన్నై నగరానికి 137 కిలో మీటర్ల దూరంలోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లో 16వ శతాబ్ధంలో శ్రీ జలకందేశ్వరర్ ఆలయం నిర్మించారు. ఈ ఆలయానికి భక్తులు సమర్పించి చిన్నచిన్న కానుకలతో అక్కడి పూజారులు అర్చనలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
అయితే ఏనాడు భారీ విరాళాలు వచ్చింది లేదు. కేంద్ర ప్రభుత్వం రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చెయ్యడంతో ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 44 లక్షల 500 రుపాయలు భారీ విరాళాలు ఇచ్చారు.
మొత్తం రూ. 44 లక్షలు రూ.1,000, రూ.500 నోట్లు విరాళంగా ఇచ్చారని ఆలయం పెద్దలు తెలిపారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జలకందేశ్వరర్ శివాలయం చుట్టూ మతపరమైన వివాదం ఉంది. అయితే 1981లో ఈ వివాదం పరిష్కారం అయ్యింది.
దీంతో ఆలయం సంరక్షణను ఆర్కియాలజికల్ సర్వే కూడా చూస్తోంది. ఇప్పుడు వచ్చిన రూ. 44 లక్షల 500 విరాళాలు బ్యాంకులో జమచేసి కొత్త నోట్లుగా మార్చి ఆలయం నిర్వహణకు ఉపయోగిస్తామని ఆలయం పెద్దలు తెలిపారు.