గుజరాతి పుడ్పై ప్రేమతో లావెక్కుతున్నా: రాహుల్ పర్సనల్ టచ్
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ పర్సనల్ టచ్ ఇచ్చారు. తన కిచెన్ గుజరాతీ వంటకాలతో నిండిపోయిందని అన్నారు. నిన్న తన సోదరి తన ఇంటికి వచ్చిందని, తన కిచెన్లో ప్రతి వంటకం గుజరాతీదే ఉండడాన్ని గుర్తించిందని ఆయన అన్నారు.
ఖాక్రా గుజరాతి, ఆచార్ గుజరాతి, మూంగ్పలి గుజరాతి ఇలా అన్ని వంటకాలు గుజరాతివే ఉన్నాయనిఅన్నారు. మీరు నన్ను చెడగొడుతున్నారు, వాటివల్ల నేను బరువు పెరిగానని ఆయన అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గుజరాత్ అభివృద్ధిపై ప్రధాని దృష్టి కేంద్రీకరించడానికి బదులు కాంగ్రెసుపైనే దృష్టి పెట్టారని ఆయన అన్నారు. నిన్నటి మోడీ ప్రసంగం విన్నానని, అందులో 60 శాతం కాంగ్రెసు గురించే మాట్లాడారని అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెసుకో, బిజెపికో సంబంధించినవి కావని, గుజరాత్ అభివృద్దికి సంబంధించినవని అన్నారు.
కాగా, ఓఖి తుఫాను కారణంగా వాతావరణం బాగా లేకపోవడంతో రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.