కోర్టులో సాక్షులపై బాంబులు వేసింది
చాప్రా: తన మీద కేసు పెట్టిన వ్యక్తులను అంతం చెయ్యడానికి ప్రయత్నించింది ఓ మహిళ బాంబు చేత పట్టుకుని ఏకంగా కోర్టు ప్రాంగణంలో సాక్షుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. అయితే అదే బాంబు పేలడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి.
బీహార్ లోని చాప్రా సిటి సివిల్ కోర్టు ప్రాంగణంలోనే సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుష్బు కుమారి అనే మహిళ మూడు కేసుల్లో నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కోంటున్నది.
పోలీసులు అరెస్టు చెయ్యడంతో కుష్బు కుమారి జైలుకు వెళ్లింది. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చింది. సోమవారం ఆమె కోర్టుకు హాజరుకావలసి ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన సాక్షి శశి భూషణ్ తో పాటు ఇద్దరిని అంతం చెయ్యాలని ఆమె నిర్ణయించింది.
సోమవారం సాక్షుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించింది. అయితే బాంబు అక్కడే పేలిసోవడంతో కుష్బు కుమారికి తీవ్రగాయాలైనాయని ఎస్పీ పంకజ్ కుమార్ చెప్పారు. ఈ బాంబు పేలుడులో ఆమెతో పాటు ఆరు మందికి తీవ్రగాయాలైనాయని అన్నారు.
ఈ బాంబు దాడిలో గాయాలైన బాలికతో సహ ఆరు మంది చాప్రా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పంకజ్ కుమార్ చెప్పారు. 2011 లో మాజీ ఎంపీ ఉమాశంకర్ సింగ్ ఇంటిలో జరిగిన ముగ్గురి హత్య కేసులో కుష్బు కుమారి మీద కేసు నమోదు అయ్యింది.