శుక్రవారం రాత్రులు అరెస్టులు తప్పే: మాడభూషి శ్రీధర్
న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రివేళ వ్యూహాత్మక అరెస్టులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. ఇలా శుక్రవారం రాత్రి అరెస్టు చేయడంద్వారా సోమవారందాకా కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా చేయడమన్నది వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని ఆయన అన్నారు.
తీహార్ జైలు అధికారులపై శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీ దాఖలు చేసిన పిటిషన్పైనా తీర్పు ఇచ్చారు. తన శిక్షాకాలాన్ని అకారణంగా పొడిగించడంపై సదరు ఖైదీ సమాచార హక్కు కింద దరఖాస్తు చేయగా జైలు అధికారులు తిరస్కరించడంతో అతడు సీఐసీని ఆశ్రయించాడు. దీంతో శిక్షాకాలం పూర్తికాగానే ఖైదీని విడుదల చేయాలి తప్ప ఇతర కారణాలతో నిర్బంధాన్ని పొడిగించరాదని శ్రీధర్ స్పష్టం చేశారు.

ఓపీ గాంధీ అనే వ్యక్తి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడిని నాలుగురోజులపాటు అదనంగా నిర్బంధించారు. ఇందుకు కారణాలు వివరించాలంటూ అతడు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశాడు. వారు తిరస్కరించడంతో గాంధీ సమాచార కమిషన్ను ఆశ్రయించాడు. అయితే ఇతర కేసులతో అతడికి సంబంధం ఉందేమోననే అలా చేసినట్లు జైలు అధికారులు చెప్పారు.
వాదనలు పరిశీలించిన శ్రీధర్ - అనుమానంతో ఒకరిని అదనపు కాలం నిర్బంధించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హెచ్చరించారు. ఆ వ్యక్తి వేరే కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ నిర్ణీత సమయంలో సదరు సమాచారం తెలుసుకుని తగు విధంగా వ్యవహరించాలి తప్ప సందేహాలతో నిర్బంధం పొడిగించరాదని వివరించారు. అసలు జైళ్లలో అదనపు నిర్బంధం- దానిపై ఫిర్యాదు, పరిహారం చెల్లింపులకు సంబంధించి నిబంధనలు లేవని, వీటిని రూపొందించి వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications