ఔరా.. దేశంలోనే అతి పెద్దది
భారతీయులకు రైల్వే అనేది వారి జీవితంలో విడదీయరాని బంధమైంది. తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరానికి క్షేమంగా తీసుకువెళ్లడమే కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య, పొలాల మధ్య పరుగులు తీసే రైలు బండి ఎక్కాలని అందరికీ అనిపిస్తుంది. రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో స్టేషన్లను చూస్తారు.. జంక్షన్లను చూస్తారు. అయితే మనకు విజయవాడ, సికింద్రాబాద్ జంక్షన్స్ ఉన్నట్లుగా దేశం మొత్తం మీద అతి పెద్ద రైల్వే జంక్షన్ ఉంది.
మధుర జంక్షన్ దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ గా పేరు తెచ్చుకుంది. ఉత్తర మధ్య రైల్వే పరిధిలోకి ఇది వస్తుంది. మొత్తం 10 ప్లాట్ ఫారాలున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటలూ ఇక్కడి నుంచి కొంచెం సమయం కూడా విరామం లేకుండా రైళ్లు నడుస్తూనే ఉంటాయి. దేశంలోని ప్రధానమైన నగరాలన్నింటికీ ఇక్కడి నుంచి చేరుకునే సదుపాయం ఉంది. 1875లో మొదటిసారి ఇక్కడి నుంచి రైలు 47 కిలోమీటర్లు నడిచింది.

మధుర-బృందావన్ మధ్య 11 కిలోమీటర్ల మీటర్ గేజ్ రైలు మార్గాన్ని 1889లో ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రయాణించే రైళ్ల సంఖ్య పెరగడంతోనాటు రైలు మార్గాలు పెరిగాయి. క్రమేణా దేశంలోనే అతి పెద్ద రైల్వే జంక్షన్ గా మారింది. మధుర జంక్షన్ తర్వాత రెండో అతి పెద్ద జంక్షన్ తమిళనాడులోని సేలంలో ఉంది. ఇక్కడి నుంచి 6 రైల్వే నెట్ వర్క్ లు వెళతాయి. 5 రైల్వే మార్గాలున్న విజయవాడ, రాయబరేలీ జంక్షన్లు మూడోస్థానంలో నిలిచాయి.
విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ హౌరా-చెన్నై, న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన లైన్ల జంక్షన్ వద్ద ఉంది. హౌరా, కాన్పూర్, న్యూఢిల్లీ తర్వాత రద్దీగా ఉండే నాలుగో రైల్వేస్టేషన్ గా నిలిచింది. ప్రతిరోజు ఇక్కడి నుంచి 1.50 లక్షల మంది ప్రయాణికులు, 200 ఎక్స్ ప్రెస్, 180 సరకు రవాణా రైళ్లు పరుగులు పెడుతుంటాయి. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఇక్కడి నుంచి కనెక్టివిటీ దొరుకుతుంది.












Click it and Unblock the Notifications