ఎంపీ మంత్రి హాట్ కామెంట్స్.. కరోనా మరణాలను ఎవరూ ఆపలేరు.. కంటిన్యూ అంటూ..
కరోనా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరికీ ఎప్పుడు ఎలా వైరస్ సోకుతుందో అర్థం కావడం లేదు. తీసుకుంటోన్న వ్యాక్సిన్ కూడా సరిగా పనిచేయడం లేదు. చాలా మంది టీకా తీసుకున్నాక వైరస్ బారినపడుతున్నారు. కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వల్ల జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటు బాధ్యతాయుతమైన పదవీలో ఉన్నా వారు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
కరోనా మృదంగం
మధ్య ప్రదేశ్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుంది. దీనిపై రాష్ట్ర మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వయసు పైబడిన తర్వాత మనుషులు చనిపోతారు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్-19 కారణంగా మృతి చెందుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కరోనా చావులను ఎవరూ ఆపలేరని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు సహకరించాలంటూ ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నారని చెప్పారు.
వైద్యులను కన్సల్ట్ కావాలి..
ప్రతి రోజూ చాలామంది చనిపోతున్నారని మీరు అడుగుతున్నారు... ప్రజలు వయసు పైబడితే చనిపోక తప్పదు కదా అని మంత్రి పేర్కొన్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించామని.. ప్రజలంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం అవసరం అని నొక్కి వక్కానించారు. కరోనా వైరస్ చికిత్స కోసం తగినంత మంది వైద్యులను కూడా ఏర్పాటు చేశామని.. ఏదైనా సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు.
భారీగా కేసులు నమోదు
మధ్యప్రదేశ్లో 9,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు నిన్న ఒక్కరోజే కరోనాతో 51 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్-19 మృతుల సంఖ్య 4,312కి చేరింది. ఒక్క నెలలో మధ్య ప్రదేశ్లో కొత్తగా 67,841 మందికి కరోనా సోకగా... 326 మంది చనిపోయారు.