దారుణం: పెద్దయ్యాక పెళ్లి చేసుకోరని, అప్పుడే పుట్టిన చిన్నారి అదనపు వేళ్లను కోసేసిన తల్లి
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఖాండ్వా జిల్లాలో ఓ గిరిజన గ్రామంలోని మహిళ అప్పుడే పుట్టిన తన చిన్నారి వేలికి, కాలికి ఎక్కువ చేతులు ఉండటం గమనించి, వాటిని తొలగించింది. దీంతో ఆ చిన్నారి చనిపోయింది.
ఆ మహిళ ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పాప చేతులు, కాళ్లకు అదనపు వేళ్లు ఉండటంతో, అలా ఉంటే ఆమెను పెద్దయ్యాక ఎవరూ పెళ్లి చేసుకోరని భయపడి, అదనపు వేళ్లను కోసేసింది. కొడవలితో ఈ ఘోరానికి పాల్పడింది. ఆ తర్వాత ఆ పాప మృతి చెందింది.
విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. దర్యాఫ్తు జరిపారు. ఆ పసిపాప డిసెంబర్ 22న పుట్టిందని, ఆమె చేతులు, కాళ్లకు ఆరేసి చొప్పున వేళ్లు ఉన్నాయని, దీంతో ఆ శిశువు తల్లి అదనపు వేళ్లను కోసేసి, గాయాలకు పేడ రాసిందని, అయితే, కొన్ని గంటలకే ఆ శిశువు మృతి చెందిందని, అదనపు వేళ్లు ఉంటే పెళ్లి కాదనే మూఢనమ్మకంతో ఆమె ఈ చర్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
ఆ పసిపాపకు వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేసులో తల్లిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఆ గ్రామంలో ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న స్థానిక వైద్య సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు. శిశువు జన్మించిన అనంతరం పాటించాల్సిన ప్రక్రియలను, జాగ్రత్తలను వైద్య సిబ్బంది కూడా విస్మరించారన్నారు.