Madhya Pradesh Polls: అక్కడ గెలిస్తే మధ్యప్రదేశ్ లో అధికారమే ! కాంగ్రెస్-బీజేపీ సర్వశక్తులు !
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలు ఓటేయబోతున్నా. ఈ ఆరు ప్రాంతాల్లో మాల్వా-నిమర్ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో ఏ పార్టీ మెజార్టీ స్ధానాలు గెలిస్తే ఆ పార్టీదే అధికారం అన్నమాట. దీంతో ప్రతీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంటాయి. ఈసారి కూడా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మాల్వా-నిమర్ ప్రాంతంలో తాజా పరిస్ధితి ఏంటో ఓ సారి చూద్దాం..
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ఇందులో 66 సీట్లు మాల్వా-నిమర్ ప్రాంతంలోనే ఉన్నాయి. 2018 లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు నెలల ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడి మందసౌర్ లో రాహుల్ పర్యటించి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని కలిశారు. వారికి 2 లక్షల రుణమాఫీ చేస్తూ పథకం ప్రకటించారు. 2017లో పోలీసు కాల్పుల్లో మరణించిన ఐదుగురు నిరసనకారుల తొలి వర్ధంతిని పురస్కరించుకుని రాహుల్ ఈ ప్రకటన చేశారు.

అయితే రాహుల్ పర్యటించిన మాండసౌర్ లో కానీ, దాని పక్కన నియోజకవర్గాల్లో కానీ కాంగ్రెస్ గెలవలేదు. కానీ మాల్వా-నిమర్ ప్రాంతంలో మాత్రం మెజార్టీ సీట్లు (34) కైవసం చేసుకుంది. బీజేపీకి గట్టి పట్టున్న ఈ ప్రాంతంలో మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెల్చుకుంది. అంతే కాదు రాష్ట్రంలో సైతం అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేసింది. అనంతరం 15 నెలల పాలన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఈ ప్రాంతంలో మంచి స్పందన లభించింది.
బలమైన ఆరెస్సెస్ మూలాలున్న ఈ ప్రాంతంలో గిరిజనులు, రైతుల జనాభా చాలా ఎక్కువ. దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకుంటూ వస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో దెబ్బతింది. ఈసారి రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాత మారిన పరిణామాలు మాల్వా-నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్ కు మరోసారి ఆధిక్యం కట్టబెడతాయని ఆ పార్టీ ధీమాగా ఉంది. అటు బీజేపీ కూడా మరోసారి ఈ ప్రాంతంలో తమ ప్రభావం చూపుతామని చెబుతోంది.












Click it and Unblock the Notifications