మారన్కు ఎదురుదెబ్బ: 'సీబీఐ ఎదుట లొంగిపోండి'
చెన్నై: మద్రాస్ హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి దయానిది మారన్కు ఎదురుదెబ్బ తగిలింది. అనధికార టెలిఫోన్ ఎక్సేంజ్ కేసులో దయానిది మారన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ మారన్ దాఖలు చేసుకున్న పిటిషన్ను తోసిపుచ్చింది.
మూడు రోజుల్లో సీబీఐ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. విచారణలో ఆయనకు సహకరించకూడదని.. ఆ కేసులో ప్రధాన నిందితుడు ఆయనేనని సీబీఐ తెలిపింది. దయానిధి మారన్ 2004-07లో కేంద్ర టెలికం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సన్ నెట్వర్క్కు 300 హై డేటా టెలిఫోన్ లైన్లను కేటాయించడంపై సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ అనధికార లైన్ల కోసం మారన్ తన నివాసాన్ని అక్రమ టెలిఫోన్ ఎక్సేంజ్గా మార్చారని ఆరోపణలతో సీబీఐ అతనిపై కేసు నమోదు చేసింది. ఈ కేసుకి సంబంధించి సన్ నెట్ వర్క్కు చెందిన సీబీఐ అధికారులు అరెస్టు చేసిన ముగ్గురికి మద్రాసు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సుమారు 323 లైన్లను సన్ టీవి ఆఫీసు మీదగా బోట్ హౌస్లోని మారన్ ఇంటికి కేటాయించిందని సీబీఐ ఛార్జిషీటులో దాఖలు చేసింది. కళానిధి ఆ లైన్లను సన్ టీవీ కార్యక్రమాల్ని కి అప్ లింక్ చేయడానికి ఆ లైన్లను వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు సన్నెట్ వర్క్ సంస్థ యాజమాన్యంపై మనీ లాండరింగ్ సహా పలు కేసులు ఉన్నాయి.
ఇప్పటికే మారన్ సోదరులకు చెందిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇటీవలే సన్నెట్ వర్క్కు చెందిన 33 ఛానళ్లకు కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టులు కల్పించుకుని హోం శాఖ నిర్ణయంపై స్టే విధించకుంటే సన్ నెట్వర్క్కు చెందిన మొత్తం 33 ఛానళ్లు మూతపడే అవకాశం ఉంది.