ఆ నాలుగు.. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు: రిపోస్టుమార్టం?
దివంగత జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా, సంచలనంగా మారాయి.
చెన్నై: దివంగత జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా, సంచలనంగా మారాయి. జయ మృతిపై దాఖలైన పిల్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
ఇదీ చిన్నమ్మ: శశికళ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు..!
జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆమెకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా విడుదల చేయలేదని, ఏ సమయంలో మృతి చెందారన్న సమాచారం కూడా సరిగా లేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ వైద్యనాథన్ పిటిషనర్ లేవనెత్తిన అంశాలని తోసిపుచ్చలేమన్నారు. జయ మృతిపై తనకూ అనుమానాలున్నాయని, అయితే అధి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. సీఎం ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉందన్నారు. దానిని ప్రభుత్వం తరఫు లాయర్ గుర్తించలేదని ప్రశ్నించారు.
ఎక్మో: జయలలితను కాపాడలేకపోయింది, ఈ టెక్కీకి పునర్జన్మ, దానిపైనే ఆధారం!
జయ మృతదేహాన్ని సమాధి నుంచి తీసి ఎందుకు పరీక్షించరాదన్నారు. అనుమానాస్పద మృతిపై రీపోస్టుమార్టం ఎందుకు చేయకూడదనే పిటిషనర్ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకున్నందున.. రీపోస్టుమార్టానికి అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది.
జయ బుగ్గపై ఆ రంధ్రాలు ఏమిటి?
జయలలిత మృతిపై అప్పట్లోనే చాలామందికి చాలా సందేహాలు వచ్చాయి. ఆమె ఎడమ బుగ్గపై కనిపించిన నాలుగు రంధ్రాలు ఏమిటనే విషయంతో పాటు విష ప్రయోగం జరిగి ఉండవచ్చంటూ అప్పట్లో సోషల్ మీడియాలోనూ, సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చ జరిగింది. తాజాగా జయ మృతిపై జస్టిస్ వైద్యనాథన్ వ్యక్తం చేసిన సందేహాలకు ఇవి కూడా కారణం అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎమ్మాలింగ్ కాదు?
ఎవరైనా మరణించినప్పుడు వారి మృతదేహాలు పాడవపోకుండా కొన్నిరోజుల పాటు ఉండేందుకు ఎమాల్మింగ్ చేస్తుంటారు. పలు రకాల రసాయనాలను శరీరంలోకి పంపించి మందులతో శరీరాన్ని శుద్ధి చేస్తారు. మృత దేహాంలోని రక్తాన్ని తొలగించి. రసాయన మందును శరీరంలోకి పంపించడాన్నే ఎమాల్మింగ్ విధానం అంటారు. సూది ద్వారా మందును శరీరంలోకి పంపిస్తారు. ఆ సూదిని గజ్జల నుంచి లేదా మెడ వెనుక భాగంలో ఇస్తారు. అందువల్ల.. జయలలిత బుగ్గపై ఏర్పడిన నాలుగు రంధ్రాలకు కారణం ఎమాల్మింగ్ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎక్మో చికిత్సనా
అలాగే, చివరి ప్రక్రియగా జయలలితకు చేసిన ఎక్మో చికిత్స వల్ల ఈ రంధ్రాలు ఏర్పడ్డాయా అని అనుకుంటే దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆమెకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి ఎక్మో పద్ధతిలో చికిత్స చేశారు. దీంతో పాటు ఆమెకు మరేదైనా చికిత్స చేశారా అన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు చెప్పాల్సి ఉంది.
శ్రీనాథ్ కోలుకున్నాడు.. మరి
జయలలిత మరణం సంభవించిన వారం రోజుల్లో ఇదే (ఎక్మో యంత్రం ద్వారా) వైద్య విధానంలో బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ అనే వ్యక్తి కోలుకున్నాడు. శ్రీనాథ్ కంటే మెరుగైన వైద్యం జయలలితకు అందింది. మరి ప్రాణాలు ఎందుకు కోల్పోయిందనే ప్రశ్న తలెత్తుతోంది.
అనుమానాలు
కాగా, జయలలిత బతికి ఉన్నప్పుడే ఆమెకు కొన్నేళ్ళుగా విషాహారం ఇచ్చినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కోయంబత్తూరుకు చెందిన కృష్ణమూర్తి అనే లాయర్ ఆరోపణలు చేయడమే కాకుండా, సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు. జయ పేరుతో పార్టీ కూడా పెడతానన్నారు.
కరుణ ఫోటో బయటకు..
జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడే మాజీ సీఎం కరుణానిధి కూడా మరో ఆసుపత్రిలో రెండుసార్లు ఆనారోగ్యంతో చేరారు. జయ దాదాపు 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండగా, కరుణ మొదటిసారి సుమారు పది రోజులు, తర్వాత నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కరుణ కోలుకుంటుండగా ఆ విషయాన్ని పార్టీ వర్గాలకు, అభిమానులకు తెలియజేసేందుకు డీఎంకే నేతలు ఫోటో విడుదల చేశారు. అయితే, దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొందిన జయకు సంబంధించి ఒక్క ఫోటోను కూడా బయటకు ఎందుకు రానివ్వలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక దశలో జయ పూర్తిగా కోలుకున్నారని, ఎప్పుడు ఇంటికెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిందని చెప్పారు. ఆ తర్వాత గుండె నొప్పితో ఆమె హఠాత్తుగా కన్నుమూశారు.
ఎన్నో అనుమానాలు
జయలలిత బుగ్గ పైన ఏర్పడిన రంధ్రాలు, విషాహారం ఆరోపణలు, ఆమె పూర్తిగా కోలుకున్నారని చెప్పి మరణవార్త వినిపించడం ఏమిటనేవి తెలియకుంటే జస్టిస్ వైద్యనాథన్ వ్యక్తం చేసిన అనుమానాలతో పాటు చాలామందికి కలిగిన సందేహాలు నివృత్తికాకుండా పోతాయని అంటున్నారు. జయకు అందించిన చికిత్స వివరాలను బయటపెట్టాలని, లేదంటే కుట్ర జరిగిందనే అనుమానాలు మరింత బలపడుతాయంటున్నారు.
చికిత్స బయటపెట్టాల్సిందే
జయలలితకు ఎలాంటి చికిత్స అందిందో కేంద్రానికి తెలుసని, కానీ ఎందుకు గోప్యత పాటించిందో తెలియదని జస్టిస్ వైద్యనాథన్ అన్నారు. జయ మృతిపై జనవరి 9వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని తీవ్రంగా మందలించారు.