అమీర్ ఖాన్ వ్యాఖ్యల్లో తప్పేం లేదు: హైకోర్టు జడ్జి
చెన్నై: మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి డి.హరిపరంథామన్ అభిప్రాయపడ్డారు. ఆమీర్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చతో పాటు వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ హరిపరంథామన్ స్పందిస్తూ.. ఆమీర్ఖాన్ తన భార్యతో జరిపిన సంభాషణను బయటకు వెల్లడించడంలో తప్పు లేదని అన్నారు.
చెన్నైలో అడ్వకేట్స్ ఫోరం నిర్వహించిన ఓ సదస్సులో గురువారం ఆయన మాట్లాడుతూ అమీర్ ఖాన్కు బాసటగా నిలిచారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం నేపథ్యంలో ఆమీర్ భార్య తన కుమారుడి భద్రత కోసం దేశం విడిచి వెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, అందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు.
పాలకులు మతానికి దూరం పాటించనప్పుడే దేశంలో అసహనం పెరుగుతుందని అన్నారు. తన భార్యకూ తనకూ మధ్య జరిగిన సంభాషణను అమీర్ ఖాన్ ప్రజలతో పంచుకోవడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. మత అసహనం పెరుగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్దామని భార్య చెప్పినప్పుడు తాను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురయ్యానని అమీర్ ఖాన్ చెప్పాడని ఆయన గుర్తు చేశారు.
బీఫ్ తిన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడి చేయడం, హేదువాదుల హత్యలు చూస్తే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు. అణచివేతకు, అసహనానికి దూరంగా ఉన్న సమాజం మాత్రమే మనుగడ సాగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.