రూ.1,296లకే జాలీ హెలికాప్టర్ రైడ్
Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాలకు పౌష్య పూర్ణిమ తిథి ప్రవేశించిన ఘడియలో కుంభ మేళా మొదలయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమం ప్రదేశంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.
45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ కుంభ మేళా. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించనున్నారు. ఇప్పటికే విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యాకు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు.

కుంభ మేళా కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చారిత్రాత్మక నగరం ప్రయాగ్రాజ్లో ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేపట్టింది. త్రివేణి సంగమం ఒడ్డున లక్షల సంఖ్యలో టెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అటు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. కుంభ మేళాను సందర్శించే భక్తుల కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 13,000లకు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్రాజ్కు రాకపోకలు సాగించనున్నాయి.
మహా కుంభ్కు వెళ్లే వారి కోసం పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో రాత్రివేళా టేకాఫ్కు అనుమతులు ఇచ్చింది. మహా కుంభ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించడానికి దేశ విదేశాల నుంచి వచ్చే కోట్లాదిమంది భక్తుల సౌకర్యం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

106 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుండి రాత్రి వేళ విమానాలు టేకాఫ్ తీసుకోబోతోన్నాయి. ప్రయాగ్రాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై, రాయ్పూర్, లక్నో, బెంగళూరు, భువనేశ్వర్, హైదరాబాద్, కోల్కత, బిలాస్పూర్.. వంటి నగరాలకు ఎయిరిండియా, ఇండిగో సహా వివిధ పౌర విమానయాన సంస్థలు ఫ్లైట్స్ను నడిపిస్తోన్నాయి.
అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా హెలికాప్టర్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఛార్జీ 1,296 రూపాయలు. 78 నిమిషాల పాటు సాగుతుందీ హెలికాప్టర్ రైడ్. దీనివల్ల- మహా కుంభ మేళా, ప్రయాగ్ రాజ్ నగరాన్ని గగనతలం నుంచి తిలకించే అవకాశం లభిస్తుంది.
ఇదివరకు ఈ హెలికాప్టర్ ఛార్జీ 3,000 రూపాయలు ఉండేది. మహా కుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఛార్జీని తగ్గించినట్లు ఉత్తరప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. హెలికాప్టర్లో పర్యటించాలనుకునే వాళ్లు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ www.upstdc.co.inలో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications