తొలి అమృత పుణ్య స్నానం: తప్పనిసరి
Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
సోమవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు పౌష్య పూర్ణిమ తిథి ప్రవేశించిన ఘడియలో కుంభ మేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ కుంభ మేళా. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.

ఇప్పటికే విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యాకు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు. కుంభ మేళా కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మహా కుంభ మేళా మరుసటి రోజును అమృత పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మకర సంక్రాంతి పండగ కూడా తోడు కావడంతో లక్షలాది మంది భక్తులు, సాధవులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ తెల్లవారు జాము నుంచే ఈ ప్రదేశం మొత్తం జనసంద్రంగా మారింది.
తొలుత 13 అఖాడాలకు చెందిన సాధువులు పుణ్యస్నానం చేశారు. సన్యాసి (శైవం), బైరాగి (వైష్ణవం), ఉదాసీన్ అఖాడాలకు చెందిన సాధవులు పుణ్యస్నానాలను ఆచరించారు. శ్రీ పంచ్ దర్శనం, జునా అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాని, శ్రీ శంభు పంచాగ్ని అఖాడ, శ్రీ పంచదర్శనం ఆవాహన్ అఖాడా, తపోనిధి శ్రీ ఆనంద్ అఖాడా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
మహా కుంభ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించడంలో మకర సంక్రాంతిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications