Maha Kumbh: రికార్డులు తిరగరాస్తున్న కుంభమేళా భక్తులు-ఇవాళ్టికి 15 కోట్లు, రేపు 10 కోట్లు ?
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా రికార్డులు తిరగరాసేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు నమోదు చేసిన కుంభమేళాను ఇవాళ్టి వరకూ 15 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. అలాగే రేపు మౌని అమావాస్య పర్వదినం కావడంతో మరో 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 18 రోజుల్లోనే పాతిక కోట్ల రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న ప్రారంభమైన కుంభమేళాకు భక్తుల ప్రవాహం కొనసాగుతోంది. దేశవిదేశాలకు చెందిన భక్తులు కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. వీరి కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయినా సరిపోవడం లేదు. అయినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ్టికి 15 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.

రేపు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు మరింత ఎక్కువగా తరలివచ్చే అవకాశాలున్నాయి. రేపు ఒక్క రోజే కనీసం 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారని భావిస్తున్నారు. ఈ రోజు చేసే స్నానాన్ని అమృతస్నానం అంటారు. ఇది తప్పకుండా చేయాలని భక్తులు భావిస్తుంటారు. దీంతో రేపు భారీగా రద్దీ ఉంటుందని అంచనా. దీని కోసం యూపీ ప్రభుత్వం మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును కూడా పెంచుతోంది.
అలాగే మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా హెలికాఫ్టర్ల ద్వారా భక్తులపై పూలు చల్లే కార్యక్రమం కూడా నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications