Mahant Narendra Giri death case: యోగి సర్కార్పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్
లక్నో: దేశంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా ధార్మిక సేవలను కొనసాగిస్తోన్న ఈ అఖాడా పరిషత్కు నేతృత్వం వహిస్తోన్న మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ బలవన్మరణానికి పాల్పడటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయన డెత్ కేస్ను సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

కీలకంగా మారిన లేఖ
అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన తరువాత అఖాడా పరిషత్ ఆశ్రమం బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయాన్ని ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. తన శిష్యుడు ఆనంద్ గిరికి ఈ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ఆనంద్ గిరి పేరు ప్రస్తావనకు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

హరిద్వార్లో ఆనంద్ గిరి అరెస్ట్..
అరెస్టు సమయంలో ఆయన హరిద్వార్లో ఉన్నారు. ప్రయాగ్ రాజ్ పోలీసులు హరిద్వార్కు వెళ్లి ఆనంద్ గిరిని అదుపులోకి తీసుకున్నారు. తన పేరుతో కొందరు కుట్ర చేస్తోన్నారని ఆనంద్ గిరి ఆరోపించారు. వారణాసి, మధురల్లో ఉన్న ఆలయాన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలంటూ మహంత్ నరేంద్ర గిరి కొంతకాలంగా పోరాటం చేశారు. దీనిమీద ఆయన పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని చేపట్టారు.

వారణాసి, మధురల్లో ఆలయాలపై..
ఈ ప్రఖ్యాత నగరాల్లో ఉన్న ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదంటూ ఆయన ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. రామజన్మభూమి పాలక మండలిలో తమ అఖాడా పరిషత్ ప్రతినిధులను కూడా తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ విస్తృతంగా కొనసాగుతోన్న నేపథ్యంలోనే- మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కుట్ర ఉందంటోన్న ఉపాధ్యక్షుడు..
తాను ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నానని, తన తదనంతరం అఖాడా పరిషత్ బాధ్యతలను ఆనంద్ గిరి అప్పగించాలంటూ సూచించారు. మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, దీని వెనుక కుట్ర ఉందంటూ అఖాడా పరిషత్ ఉపాధ్యక్షుడు దేవేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఆత్మహత్య ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఆయన డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

త్వరలో ప్రభుత్వ పెద్దలతో..
నరేంద్ర గిరి డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ- ఇతర హిందూ ధార్మిక సంఘాలతో కలిసి త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఆయన చెప్పారు. నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితులు ఉద్దేశపూరకంగా సృష్టించి ఉంటారని, ఆయనపై మానసిక ఒత్తిళ్లను తీసుకుని ఉంటారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. నరేంద్ర గిరి మానసికంగా ఆందోళనకు గురయ్యారనే విషయాన్ని ఆత్మహత్య లేఖ స్పష్టం చేస్తోందని దేవేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Recommended Video

సీబీఐకి మాత్రమే సాధ్యం..
ఆయన మరణంపై సమగ్ర దర్యాప్తును జరిపించాలని, ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అది సీబీఐకి మాత్రమే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. సూసైడ్ నోట్లో ఆశ్రమానికి సంబంధించి వ్యవహారాలను ఎవరు చూసుకోవాలనే విషయాన్ని పొందుపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ కోణంలోనూ దర్యాప్తు సాగించాలని దేవేంద్ర సింగ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications