కరోనా ప్రళయం: మహారాష్ట్ర, ఢిల్లీలో పట్టపగ్గాలేవు -ఆ రెండు రాష్ట్రాల్లోనే లక్షకు చేరువగా కొత్త కేసులు
దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై కొలువైన మహారాష్ట్రతోపాటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తున్నది. కేవలం ఆ రెండు రాష్ట్రాల్లోనే కొత్త కేసులు లక్షకు చేరువగా రికార్డయ్యాయి. రెండు చోట్లా కఠిన ఆంక్షలు అమలవుతున్నప్పటికీ కొత్త కేసులు భారీగా, గతంలో ఎన్నడూ లేనంత భారీగా నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 63,729 కొత్త కేసులు, 398 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,33,08,878 శాంపిల్స్ పరీక్షించగా.. 37,03,584మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 30,04,391మంది కోలుకోగా.. 59,551మంది మరణించారు. ప్రస్తుతం 6,38,034 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఢిల్లీ ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి బులిటెన్ ప్రకారం.. గత 24గంటల వ్యవధిలో 98,957 శాంపిల్స్ పరీక్షించగా.. 19,486 కొత్త కేసులు వచ్చాయి. 141మంది మృతిచెందారు. తాజా గణాంకాలతో కలుపుకొంటే ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 8,03,623కు, మరణాల సంఖ్య 11,793కు పెరిగింది. ప్రస్తుతం 61,005 యాక్టివ్కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
మహారాష్ట్ర అంతటా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నా, ముంబై నగరంలో ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో వేల సంఖ్యలో కొత్త రోగులు వస్తుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు చాలక, ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాక్సిన్ల కొరత కారణంగా చాలా కేంద్రాల్లో టీకాల పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.