అనుకోకుండా సీఎం అయిన ఏక్నాథ్ షిండే సర్కారుకు 4న బలపరీక్ష: పార్టీల బలాలు ఇలా
ముంబై: మహారాష్ట్ర సంక్షోభం కీలక మలుపులు తిరిగి చివరకు శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్ నాథ్ షిండే. అయితే, ఇప్పుడు బీజేపీ-శివసేన తిరుగుబాటు వర్గం కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం జులై 4న బలపరీక్ష ఎదుర్కోనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
మహా అసెంబ్లీ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ఏక్నాథ్ షిండే
సోమవారం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విశ్వాస తీర్మానాన్ని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇందుకోసం జులై 3,4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సామవేశం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ సర్వేకర్ నామినేషన్ దాఖలు చేశారు. అవసరమైతే జులై 3నే స్పీకర్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత నానా పటేలో రాజీనామా తర్వాత స్పీకర్ స్థానం ఖాళీగా ఉంది.
అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సీఎం అయిన షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తారనుకున్న ఏక్నాథ్ షిండే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా ముఖ్యమంత్రి పదవినే అలంకరించారు. గురువారం రాత్రి షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం అవుతారనుకున్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పాటైన ఈ ప్రభుత్వం బలనిరూపణకు జులై 4 వరకు గడువు ఇచ్చారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ.
మహా అసెంబ్లీలో బీజేపీ-షిండేకున్న బలమెంత?
ఈ క్రమంలోనే జులై 3,4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. శివసేనకు ఉన్న మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో తన వద్ద 39 మంది ఉన్నారని ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇంకొన్ని పార్టీల మద్దతు, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని.. దీంతో తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని షిండే చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం సీట్లు 288లో సగం అంటే 144 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.