బస్సులో మహిళను బలవంతంగా ముద్దాడి!: బీజేపీ నేత అరెస్టు..
బాధితురాలి ఫిర్యాదుతో రవీంద్రను అరెస్టు చేసిన బ్రహ్మపురి పోలీసులు.. ఆయన్ను 6రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. జూలై 6వరకు ఈ కస్టడీ కొనసాగనుంది.
గడ్చిరోలి: బస్సులో ఓ మహిళ(20)ను ముద్దుపెట్టుకోవడమే కాక ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నేత రవీంద్ర బవన్థాడేను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మహిళ గౌరవానికి భంగం కలిగించడంతో పాటు, ఆమెపై బలత్కారం చేయబోయడాన్ని అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.
ఉద్యోగం ఇప్పించడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటానని రవీంద్ర తనకు గతంలో మాట ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కదులుతున్న లగ్జరీ బస్సులో ఆమెను రవీంద్ర బలవంతంగా ముద్దుపెట్టుకున్న వీడియో మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2014 ఎన్నికల సందర్భంగా ఆర్మోరి అసెంబ్లీ నియోజకవర్గానికి రవీంద్ర బీజేపీ ఇన్ఛార్జీగా వ్యవహరించారు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆయన టీచర్ గాను పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్ పూర్ నుంచి గడ్చిరోలికి ఆ మహిళతో పాటు బస్సులో వెళ్తున్న సమయంలో ఆయన ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చుట్టూ ఇతర ప్రయాణికులు ఉన్నా.. అదేది పట్టించుకోకుండా తన పని తాను కానిచ్చేశాడు.
బాధితురాలి ఫిర్యాదుతో రవీంద్రను అరెస్టు చేసిన బ్రహ్మపురి పోలీసులు.. ఆయన్ను 6రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. జూలై 6వరకు ఈ కస్టడీ కొనసాగనుంది. ఐపీసీ సెక్షన్-376కింద రవీంద్రపై అత్యాచార కేసు నమోదు చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన గడ్చిరోలి ఎంపీ అశోక్ నేతే.. రవీంద్ర తమ పార్టీలో కొనసాగడం లేదని తలపడం గమనార్హం. పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు చాలాకాలంగా దూరం ఉండటంతో.. అతన్ని పార్టీ నుంచి తప్పించామన్నారు.