నా తప్పు తెలిసింది: శివాజీ భుజంపై చేయివేసి ఫోటో దిగిన మహిళా నేత
ముంబై: బిజెపి నాయకురాలు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్ రాజ్శ్రీ శిర్వాద్కర్... ఛత్రపతి శివాజీ భుజంపై చేయి వేసి దిగిన ఫోటో ఇంటర్నెట్లో విమర్శలకు తావిచ్చింది. ఆమె పైన నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
దాని పైన ఆమె ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది. దానిని చూసిన ఆమె, తన చెయ్యిని శివాజీ భుజం పైన వేసి ఫోటోను దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో దుమారం రేగింది. దేశవ్యాప్తంగా పూజ్యనీయుడు అయిన శివాజీని అవమానించేలా రాజ్శ్రీ ప్రవర్తించాలని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఆమె చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ర్యాలీ కూడా నిర్వహించారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో, ఆమె తన చర్యకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. శివాజీ అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పారు. నేను నా తప్పును తెలుసుకున్నానని, దీనికి క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. ప్రతిపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా దీనిని రాజకీయం చేస్తున్నాయన్నారు. శివాజీ అంటే తనకు ఎంతో గౌరవం అని, అది ఎప్పటికీ ఉంటుందని చెప్పారు.