సీఎంగా ఫడ్నవీస్ మార్కు, టికెట్ కొని మరీ ప్రయాణం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ సాధారణం ప్రయాణీకుడిలా ప్రయాణించి తన మార్కును చాటుకుని ఆశ్యర్యంలో ముంచెత్తారు. ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా సామాన్యుడిగా ఉండటంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకుంటున్నారు.
ఆదివారం ముంబై నుంచి నాగ్ పూర్ కు బయలుదేరిన ఫడ్నవీస్, భార్య అమృత, కూతురుతో కలిసి నేరుగా ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో స్వయంగా డబ్బు చెల్లించి మూడు టికెట్టు కొనుగోలు చేశారు. ఆ తర్వాత నేరుగా జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఎకానమీ క్లాసులోకి ప్రవేశించిన ఫడ్నవీస్, తనకు కేటాయించిన సీట్లో కూర్చోని నాగ్ పూర్కు ప్రయాణించారు.
మహారాష్ట్ర చరిత్రలో ఓ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీలా ప్రయాణించడం ఇదే మొదటిసారి. దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏ ముఖ్యమంత్రి కూడా సాధారణ ప్రయాణికుడిలా కలిసి అందరితో ప్రయాణించలేదని విమానంలో తోటి ప్రయాణీకుడు వ్యాఖ్యానించారు. దేవేంద్ర ఫడ్నవీస్ పాలనలో మహారాష్ట్రలో దుబారా తగ్గిపోవడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రధాని అధికారులు, రాజకీయ నేతలు ఎవ్వరూ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించడం, ఫైవ్ స్టార్ హోటల్స్లో బస చేయడం లాంటి చేయకూడదని సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అతి పిన్న వయస్కుల్లో రెండో వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.
12న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ బలపరీక్ష
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 12న తన బలాన్ని నిరూపించుకోనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలపరీక్షను ఎదుర్కొనేందుకు ఫడ్నవీస్ దాదాపుగా సిద్ధమయ్యారని మహారాష్ట్ర సీఎంఓ వర్గాలు తెలిపాయి.
ఇటీవల రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ ఫలితాల అనంతరం ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకోలేకపోయింది.
శివసేనతో పొత్తు ఖాయమని.. పొత్తుపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఆదివారం ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన వెల్లడించారు. దీంతో ఈ నెల 12న బల పరీక్షను ఎదుర్కొనేందుకే ఫడ్నవీస్ మొగ్గు చూపుతున్నారు.