ఎన్సీపీ ఎఫెక్ట్: మహారాష్ట్ర సిఎం చవాన్ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన శుక్రవారంనాడు గవర్నర్ కె. శంకరనారాయణన్కు సమర్పించారు. కాంగ్రెసు నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్సీపి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఎన్సీపి మద్దతు ఉపసంహరణతో చవాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
కాంగ్రెసు పార్టీతో పదిహేనేళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్సీపి మహారాష్ట్ర ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెసు, ఎన్సీపిలకు మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో పొత్తు బెడిసికొట్టింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 15వ తేదీన జరగనున్నాయి.
మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలున్నాయి. మొదటి విడతగా కాంగ్రెసు 118 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్సీపి ఆగ్రహం చెందిది. అదే సమయంలో బిజెపి, శివసేన 20 ఏళ్ల బంధానికి కూడా తెరపడింది. ఈ రెండు పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు కుదరలేదు.
పొత్తులు బెడిసికొట్టడంతో మహారాష్ట్ర శాసనసభకు చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పీఠమే కేంద్రంగా కూటములు చెదిరిపోయాయి. శివసేన ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించి, బిజెపికి తక్కువ సీట్లు ఇస్తానని మొండికేసింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు.