ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అప్పుడే: రూ.3 లక్షల రైతు రుణమాఫీ
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

ఈ పరిస్థితుల మధ్య తాజాగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. మొత్తం అయిదు గ్యారంటీలను ఇందులో పొందుపరిచింది. కర్ణాటక, తెలంగాణల్లో అందలాన్ని అందుకోవడంలో కీలక భూమికను పోషించిన హామీలన్నింటినీ మహారాష్ట్రలోనూ అమలు చేయాలని సంకల్పించింది కాంగ్రెస్.
పంచ సూత్ర పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళలు, రైతులు, యువత, సామాజిక భద్రత, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పంచ సూత్ర మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్లందరిపైనా హామీల వర్షాన్ని కురిపించింది.
మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తే- ప్రతి నెలా మహిళలకు 3,000 రూపాయల ఆర్థిక సహకారం అందుతుంది. మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని కల్పిస్తుంది ప్రభుత్వం. కర్ణాటక, తెలంగాణల్లో అమలులో ఉన్న విధంగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా వెసలుబాటు కల్పిస్తుంది.

రైతులపైనా వరాలను కురిపించింది. మూడు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన రైతులకు కూడా 50,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.
అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా కులగణననూ చేపడతామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తామనీ పేర్కొంది. 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కవరేజీతో పాటు ఉచితంగా మందులను అందిస్తామని తెలిపింది. నిరుద్యోగ యువతకు ప్రతినెలా 4,000 రూపాయల ఆర్థిక చేయూత ఇస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications