మహారాష్ట్రలో జూన్ 1 వరకు లాక్డౌన్ తరహా ఆంక్షలు పొడిగింపు
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ.. రోజువారీగా 40వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ తరహాలో ఆంక్షలను మరో నెలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 7 గంటల వరకు ఆంక్షలను జూన్ 1 వరకు పొడిగించింది.
ప్రస్తుత ఆంక్షలతోపాటు మరికొన్ని నిబంధనలను చేర్చింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సీతారాం కుంతే తెలిపారు.
'పాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ పరిమితులు లేకుండా అనుమతించబడతాయి. నిత్యావసరాలు, అత్యవసరాల దుకాణాలకు పరిమితులకు లోబడి అనుమతి ఉంది, పరిమితులతో హోండెలివరీ కూడా అనుమతి ఉందని అని ప్రభుత్వ ఉత్తర్వు తెలిపింది.
స్థానిక విపత్తు నిర్వహణ అథారిటీ (డిఎంఎ)ను గ్రామీణ మార్కెట్లలో కోవిడ్-తగిన ప్రవర్తనను నిర్ధారించమని కోరింది. నిబంధనలను పాటించని దుకాణాలపై మూసివేయడానికి లేదా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో సరుకుల రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. లోకల్ ట్రైన్స్, మెట్రో సర్వీసులు కరోనా సంబంధిత పరికరాలు, సరుకులు, వస్తువుల రవాణాకు మాత్రమే సేవలందిస్తాయని పేర్కొంది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో 82.51 శాతం యాక్టివ్ కేసులున్నాయి.
బుధవారం మహారాష్ట్రలో 46,781 కరోనా కేసులు నమోదు కాగా, 58,805 మంది కోలుకున్నారు. మరో 816 మంది మరణించారు. లాక్డౌన్ ఆంక్షల కారణంగా 17.36 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గింది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
గత 24 గంటల్లో పుణెలో 9536 కరోనా కేసులు నమోదు కాగా, 74 మంది మరణించారు. ముంబైలో 2104 కేసులు నమోదు కాగా, 66 మంది మరణించారు. దేశంలో గత 24 గంటల్లో 3.5 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4వేలకు పైగా మరణాలు సంభవించాయి.