సీఎం వచ్చేదాకా అంత్యక్రియలు వద్దు.. కలకలం రేపుతోన్న రైతు సూసైడ్ నోట్
'సీఎం తన మృతదేహాన్ని సందర్శించేంతవరకు అంత్యక్రియలు జరపవద్దని' ఆత్మహత్య చేసుకున్న ధనజీ లేఖలో పేర్కొన్నాడు.
పుణే: మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్నాయి. గత వారం రోజులుగా మహారాష్ట్రలో రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాజాగా మహారాష్ట్రలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఒక నోట్ రాసిన రైతు.. ప్రభుత్వం రుణమాఫీ సహా తదిరత డిమాండ్లను నెరవేర్చేదాకా తన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని లేఖలో రాశాడు.
ఇంత ఆవేదనగా రైతు రాసిన లేఖ అక్కడి రైతులను మరింత ఉద్వేగానికి గురిచేసింది. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. కాగా, సోలాపూర్ లోని కర్మాళి తాలుకాలో ధనజీ చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని స్థానిక కలెక్టర్ రాజేంద్ర భోంస్లే ధ్రువీకరించారు. రైతు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
'సీఎం తన మృతదేహాన్ని సందర్శించేంతవరకు అంత్యక్రియలు జరపవద్దని' ఆత్మహత్య చేసుకున్న ధనజీ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైతు రుణమాఫీ ప్రకటించేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని రైతులు రాస్తా రోకో నిర్వహించారు. రాష్ట్రమంత్రి విజరు దేశ్ ముఖ్ గురువారం ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2.5ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమిపై ధనజీ 60వేల రుణం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, రైతు సంఘాల నిరవధిక సమ్మెతో రాష్ట్రంలోని ముంబై, పుణే నగరాలు సహా మొత్తం 20జిల్లాలకు కూరగాయలు, పండ్లు, పాల రవాణా నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున పాలను, ఉల్లిపాయలను రోడ్లపై కుమ్మరించి తీవ్ర ఆందోళన చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, కనీస మద్దతు ధర ప్రకటించాలని, రుణమాఫీ చేయాలని అక్కడి రైతులు పోరుబాట పట్టారు. రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే.