కరోనా కంట్రోల్ కు మహా సర్కార్ సంచలన నిర్ణయం ... అక్కడ లిక్కర్ షాపులు బంద్
మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి . ఇక కరోనా కట్టడి కోసం తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న మహా సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో తాజాగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 15,525 కు చేరింది . రాష్ట్ర మరణాల సంఖ్య 617 కు పెరిగింది. మొత్తం మరణాలలో అత్యధికంగా ముంబైలో నమోదయ్యాయి. ఇక అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపధ్యంలో మహా సర్కార్ ముంబై లో 144 సెక్షన్ విధించటమే కాకుండా లిక్కర్ షాపులను బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. తీవ్ర నిర్ణయాల దిశగా మహా సర్కార్
ముంబై నగరంలో మే 17 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించిన మహా ప్రభుత్వం అత్యవసరాలు తప్పించి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని పేర్కొంది. నిబంధనలను అతిక్రమించిన వారు ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక ఇదే సమయంలో మందుబాబులకు పెద్ద షాక్ ఇచ్చింది. లిక్కర్ షాపులు తెరిచినట్టే తెరిచి మూసివేసింది. దాదాపు నెలన్నర తరువాత ఎప్పుడెప్పుడు లిక్కర్ దొరుకుతుందా అని ఎదురు చూసిన వాళ్లకు సోమవారం నుంచి లిక్కర్ షాపులు ఓపెన్ చెయ్యటంతో ఊపిరి పీల్చుకున్నారు . ఇక లిక్కర్ కోసం వైన్స్ ముందు క్యూ కట్టారు. సామాజిక దూరం పాటించాలని, క్యూలైన్లో ఉండాలని పోలీసులు, ప్రభుత్వం చెప్తున్నా పెడచెవిన పెట్టారు మందుబాబులు .
దీంతో మళ్ళీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని భావించి మహా సర్కార్ లిక్కర్ షాపులను మూసివెయ్యాలని సంచలన నిర్ణయం తీసుకుంది . ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పాటు లిక్కర్ షాపుల వద్ద జనాలను కంట్రోల్ చెయ్యటం పెద్ద టాస్క్ గా మారటంతో ముంబైలో మద్యం షాపులను బుధవారం నుంచి మూసేస్తున్నట్టు ప్రకటించింది. ముంబై నగరంలో 144 సెక్షన్ విధించి నిత్యవసర వస్తువులకు , మెడికల్ షాపులకు మినహాయింపు ఇచ్చి మిగతా అన్నింటిని బుధవారం నుంచి క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక దీంతో రెండు రోజులపాటు రోడ్డుపైకి వచ్చిన మందుబాబులు ఈరోజు నుంచి తిరిగి ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.