మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం-సై అంటే సై అంటున్న పాత మిత్రులు శివసేన, బీజేపీ
మహారాష్ట్రలో పాత మిత్రులు బీజేపీ, శివసేన కత్తులు దూసుకుంటున్నాయి. లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనం పేరుతో మొదలైన ఈ వివాదం కాస్తా ముదురుతోంది. దీంతో ముంబైలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొంటున్నాయి. ఈ వివాదంలో వెనక్కితగ్గేందుకు ఇరు పార్టీలు కూడా సిద్ధంగా లేవు.
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.ఒకప్పుడు బలమైన మిత్రపక్షాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేన మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత రాజ్ ఠాక్రే సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ థాకరే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ (ముస్లింల ప్రార్థనకు పిలుపు)పై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటి నుంచీ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో లౌడ్ స్పీకర్ వాడకంపై వివాదం నడుస్తోంది.
గత వారం ఈ వివాదాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల ఉపయోగం కోసం నిబంధనలను రూపొందించడం ప్రారంభించింది. మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారంటూ అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణాల్ని ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపింది. ఎంపీ-ఎమ్మెల్యే దంపతులు నవనీత్ మరియు రవి రాణా అరెస్టును సమర్థిస్తూ, రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ స్పందించారు. ముంబై పోలీసులు చట్ట పరిధిలో ఉన్నదే చేశారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించినట్లు ఆయన వెల్లడించారు.
అయితే రాజ్ థాక్రే పిలుపు మేరకు అజాన్ కు వ్యతిరేకంగా సీఎం ఉద్ధవ్ ఇంటిముందు హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ నవనీత్ కౌర్ దంపతులు చేసిన ప్రకటనలతో వారిని అరెస్టు చేశారు. ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు రంగంలోకి దిగిన బీజేపీ నేతలు.. ఉద్ధవ్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ నిర్వహిస్తున్న అఖిలపక్ష భేటీకి కూడా దూరంగా ఉండిపోయారు. అయినా ఉద్ధవ్ ఇదేమీ పట్టించుకోకుండా తమ పని తాను చేస్తున్నారు.