అమ్మాయిల పేర్లు పెట్టండి.. బాగా అమ్మడుపోతాయి: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై క్షమాపణ...
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి గిరీష్ మహాజన్ ను కూడా ఆహ్వానించారు.
ముంబై: మద్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఒకవైపు మహిళలు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు మహారాష్ట్ర నీటి వనరుల మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ అమ్మాయి పేరు మద్యం పెడితే బాగా అమ్ముడుపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి గిరీష్ మహాజన్ ను కూడా ఆహ్వానించారు. సదరు వ్యాపారికి షుగర్ ఫ్యాక్టరీనే కాకుండా మద్యం వ్యాపారాలు కూడా ఉన్నాయి.
తన వైన్ షాపులకు ఆయన 'మహారాజా' అని పేరు పెట్టుకుంటారు. ఆ వ్యాపారి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గిరీష్ మాట్లాడుతూ... మద్యం విక్రయాలకు గిరాకీ బాగా రావాలంటే వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలని వ్యాఖ్యానించారు.
చాలా ఉత్పత్తులకు మహిళల పేర్లు పెట్టి అమ్మకాలు జరుపుతున్నారని, పొగాకు ఉత్పత్తులు అంతగా అమ్ముడు పోవడానికి వాటికి మహిళల పేర్లు పెట్టడమే కారణమని మంత్రి గిరీష్ అన్నారు. కనుక మద్యం షాపులకు 'మహారాజా'కి బదులు 'మహారాణి' అనో లేకుంటే బాబీ, జూలీ అనో పేరు మార్చాలని ఆయన సూచించడం అక్కడున్న వారిని అవాక్కయ్యేలా చేసింది.
రేగిన దుమారం.. క్షమాపణ అడిగిన మంత్రి...
మంత్రి గిరీష్ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించాయి. చాలామంది మహిళా సంఘ నేతలు, సామాజిక వాలులు, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
దీంతో మంత్రి గిరీష్ స్పందిస్తూ.. 'మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు.. నా వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను.. క్షమాపణ అడుతుతున్నాను..' అని పేర్కొన్నారు. ఈ విషయమై తాను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా చర్చించానని ఆయన తెలిపారు.