మా ఇంట్లో సేద తీరండి: వరద బాధితులకు మంత్రి బాపత్ పిలుపు
ముంబై: ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మహరాష్ట్ర శాసనసభ వ్యవహరాలశాఖ మంత్రి గిరిష్ బాపత్ మానవత్వాన్ని చాటుకొన్నారు. వర్షంతో ఇబ్బందిపడుతున్న ప్రజలు తన నివాసంలో తలదాచుకోవాలని సూచించారు.
ఈ మేరకు ఆయన ఫేస్బుక్ ద్వారా ప్రజలను కోరారు.తన నివాసానికి పరిసరాల్లో ఉన్న ఫోర్ట్, మంత్రాలయ దగ్గర చిక్కుకుపోయిన ప్రజలను తన ఇంటికి వచ్చి సేద తీరాల్సిందిగా కోరారు. కాగా, ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతోంటే తనకేమీ పట్టనట్టు ఆయన వ్యవహరించలేదు.
సోషల్ మీడియాతో పాటు ఇతరత్రా సమాచార వ్యవస్థల ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు తాము ఉన్నామని మహరాష్ట్ర సర్కార్ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది.