మహారాష్ట్ర: భాజపా-శివసేన మధ్య పొత్తు పొడిచింది
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎన్నికల్లో భాజపా - శివసేన కూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. శివసేన అనుకున్నట్లుగానే 151 స్దానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 130 స్దానాలు, ఆయా కూటమి పార్టీలకు ముందుగా 18 సీట్లు అనుకున్నా కేవలం 7 స్దానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
సీట్ల సర్దుబాటు, ఎన్నికల పొత్తు కొనసాగించడానికి ఇరు పార్టీల నేతలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. దీనిపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సీట్ల సర్దుబాటుపై భాజపా - శివసేన పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న స్తబ్దతకు తెరపడింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 15న జరగనున్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ స్దానాల సంఖ్య 288.
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.
నోటిఫికేషన్ జారీ:
ఈనెల 27వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
అక్టోబర్ 15వ తేదీన పోలింగ్
అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు