మహారాష్ట్ర తిరుగుబాటు మంత్రులకు బిగ్ షాక్ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే: కుమారుడికి కీలక శాఖ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటోన్నాయి. అటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే-ఇటు తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఎత్తుల మీద పైఎత్తులు వేస్తోన్నారు. ఒకరిని ఒకరు బలహీనపరుచుకునేలా పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవడంతో అక్కడి సంక్షోభ తీవ్రత పతాక స్థాయికి చేరినట్టయింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభ పరిస్థితులను నివారించడంలో సంజయ్ రౌత్.. కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరేకు ఆయన కుడిభుజంలా వ్యవహరిస్తోన్నారు.
అలాంటి నాయకుడికి ఈడీ నుంచి సమన్లు అందిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మంత్రుల పోర్ట్ఫోలియోలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు. ఏక్నాథ్ షిండే క్యాంప్లో కొనసాగుతున్న మంత్రుల శాఖలన్నింటినీ తొలగించి వేశారు. వాటిని అందుబాటులో ఉన్న మంత్రులకు కేటాయించారు. షిండే పర్యవేక్షణలో ఉన్న శాఖలు కూడా దీనికి మినహాయింపు కాదు. తొమ్మిది మంది మంత్రులు షిండే వర్గంలో చేరారు.
ఏక్నాథ్ షిండే ఆధీనంలో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను సుభాష్ దేశాయ్కు కేటాయించారు. గులాబ్ రావు పాటిల్ పర్యవేక్షణలో ఉన్న వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ను అనిల్ పరబ్కు అప్పగించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖను సాందీపన్ రావు భుమ్రేకు బదలాయించారు. ఇప్పటివరకు ఈ శాఖ దాదాజీ భుసే ఆధీనంలో ఉండేది. ఆయన ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడంతో ఉద్ధవ్ థాకరే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉన్నత విద్య, సాంకేతిక విద్య మంత్రిత్వ శాఖలను తన కుమారుడు ఆదిత్య థాకరేకు కేటాయించారు. ఉదయ్ సామంత్ ఆధీనంలో ఉండే శాఖలు ఈ రెండూ. ఆయన ఏక్నాథ్ షిండే క్యాంప్లో చేరారు. ప్రస్తుతం అస్సాం గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటోన్నారు. మంత్రులు తిరుగుబాటు చేయడం, అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా శాఖల్లో పలు కీలక ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. పరిపాలన స్తంభించినట్టయింది. దీన్ని నివారించడానికి ఉద్ధవ్ థాకరే- శాఖల ప్రక్షాళణకు పూనుకున్నారు.