మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఒక్కరోజులోనే అరలక్షకుపైగా కొత్త కరోనా కేసులు, 222 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిల మహారాష్ట్రలో 57,074 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 222 మంది మరణించారు. ఒక్క ముంబైలోనే 11,163 కేసులు, 25 మరణాలు సంభవించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4,30,503 యాక్టివ్ కేులున్నాయి.
ఒక్క ముంబైలో 68,052 యాక్టివ్ కేసులున్నాయి. తాజా సంఖ్యతో మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,10,595కి చేరింది. ఇప్పటి వరకు 2,05,40,111 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.
కరోనా మహమ్మారి ఉధృతిపై మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తి లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలు, నగరాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలులో ఉండటంతోపాటు పగలు సమయంలోనూ ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడే అవకాశం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.












Click it and Unblock the Notifications