మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సరికొత్త రికార్డులు: దేశంలో సగం కంటే ఎక్కువ ఇక్కడే
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఏడాదిలో అత్యధికం కావడం గమనార్హం. అంతేగాక, గత 24 గంటల్లో 56 మంది కరోనాతో మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
గత నెల రోజుల నుంచి మహారాష్ట్రలో ప్రతి రోజు 6వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా 10వేల కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. తాజాగా, 16వేల వరకు కేసులు నమోదువుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మహారాష్ట్రలో శుక్రవారం నాటికి 1,10,485 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇది సగం కంటే ఎక్కువ.

మహారాష్ట్రలోని నగరాలు, జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
శక్రవారం నాడు ముంబైలో 1646 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ముంబైలో 11,083, థానేలో 11,422, పుణెలో 21,788, ఔరంగాబాద్లో 5569, నాగపూర్లో 15,011, నాసిక్లో 5272, అమరావతిలో 4206, అకోలాలో 3846, జలగావ్లో 4802 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో నాగ్పూర్లో లాక్ డౌన్ విధించగా, పుణెలో నైట్ కర్ఫ్యూ విధించారు.

మరోసారి లాక్ డౌన్ విధిస్తామంటూ సీఎం ఉద్ధవ్
శుక్రవారం 11,344 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 21,17,744కు చేరింది. ఇది మొత్తం కేసుల్లో 92.79 శాతంగా ఉంది. ప్రస్తుతం 5,42,693 హోంక్వారంటైన్లో ఉండగా, 4,884 మంది కరోనా బాధితులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, గురువారం 14,317 కరోనా కేసులు నమోదు కాగా, 57 మంది మరణించారు. భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నగరాలు, జిల్లాల్లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై కేంద్రం ఆందోళన
మహారాష్ట్రతోపాటు ఆరు రాష్ట్రాల్లోనే దేశంలోని 85 శాతం కరోనా కేసులు ఉండటం గమనార్హం. మహారాష్ట్ర తర్వాత కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర వైద్య బృందాలను కూడా పంపిస్తోంది.












Click it and Unblock the Notifications