రికార్డులు బ్రేక్: మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు, దేశంలో సగానికిపైగా ఇక్కడే బాధితులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం మహారాష్ట్రలో 23,179 కేసులు నమోదు కాగా, గురువారం 25వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 25వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో దేశ వ్యాప్తంగానూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

మహారాష్ట్రలో ఒక్కరోజే 25వేలకుపైగా కొత్త కేసులు
గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 25,833 కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాగా, 58 మంది మరణించారు. ఒక్క నాగ్పూర్ జిల్లాలోనే కొత్తగా 3796 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మరో 12,764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 24,75,565కు చేరింది. రికవరీ రేటు 90.79 శాతంగా ఉంది.

నాగ్పూర్, ముంబైలో భారీగా కేసులు
మహారాష్ట్రలో మరణాల రేటు 2.22 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,13,211 మంది హోంక్వారంటైన్లో ఉండగా, 7079 మంది ఇనిస్టిట్యూషణల్ క్వారంటైన్లో ఉన్నారు. నాగ్పూర్లో 1277 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు. ఇక ముంబై మహానగరంలో 2877 కరోనా కేసులు నమోదు కాగా, 8 మంది కరోనాతో మరణించారు.

యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్న నగరాలివే..
మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,66,353కు పెరిగింది. ఇది దేశం మొత్తం యాక్టివ్ కేసుల్లో సగానికి కంటే ఎక్కువ కావడం గమనార్హం. నాగ్పూర్, ముంబై తర్వాత పుణెలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి.
నాగ్పూర్లో 2926 యాక్టివ్ కేసులుండగా, ముంబైలో 2877, పుణెలో 2791, నాసిక్లో 1675, ఔరంగాబాద్ లో 1274 యాక్టివ్ కేసులున్నాయి.
మహారాష్ట్రలో జిల్లాలవారీగా యాక్టివ్ కేసులున్నవి..
పుణె: 35,539
నాగ్పూర్: 24,209
ముంబై: 17,153
థానె: 15,548
నాసిక్: 11,037
ఔరంగాబాద్: 10,340
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,56,830 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 23,96,340 (13.35 శాతం) మంది కరోనా పాజిటివ్ అని తేలింది.

మహారాష్ట్రలో మరింత కఠినంగా కరోనా నిబంధనలు
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రజలను అప్రమత్తం చేశారు. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతోనే నిర్వహణ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్ కరోనా నిబంధనలను పాటించాలని.. లేదంటే మూసివేయడంతోపాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నగరాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications