మహారాష్ట్రలో మహిళా ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం-ప్రైవేటు కారుపై బుగ్గ-వీఐడీ డిమాండ్లతో రచ్చ..!
మహారాష్ట్రలోని పూణేలో ఓ మహిళా ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం బయటపడింది. శిక్షణా కాలంలో ఉన్న యువ అధికారి పూజా ఖేడ్కర్ తాను పూర్తి స్థాయి ఐఏఎస్ అని మర్చిపోయి మరీ తనకు సకల సౌకర్యాలు కావాలని డిమాండ్లు చేయడం, తన ప్రైవేటు కారుపై రంగు రంగుల బుగ్గ (లైట్ ) ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇవన్నీ బహిర్గతం కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆమెపై ఇవాళ బదిలీ వేటు వేసింది.
అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్ను పూణె నుంచి వాషిమ్కు బదిలీ చేసింది. ఆమెను వాషిమ్లో సూపర్న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే సీఎస్ కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి తన పరిశీలనలో మిగిలిన కాలాన్ని వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రొబేషన్ అధికారికి అనుమతి లేని ప్రత్యేక అధికారాలను కలెక్టర్ కార్యాలయం నుంచి కోరడం ద్వారా పూజా ఖేద్కర్ వివాదంలో చిక్కుకున్నారు.ఆమె తన ప్రైవేట్ ఆడి కారును ఎరుపు-నీలం బెకన్ లైట్, వీఐపీ నంబర్ తో ఉపయోగించారు. దీనిపై కలకలం రేగింది. ఆమె తన ప్రైవేట్ కారుపై మహారాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డును కూడా పెట్టుకున్నారు. ఖేద్కర్ అన్యాయమైన డిమాండ్లను కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వీఐపీ నంబర్ ప్లేటుతో పాటు అధికారిక వసతి, తగినంత సిబ్బంది, అధికారిక ఛాంబర్, ఓ కానిస్టేబుల్ సదుపాయం కూడా ఉన్నాయి.

పూజా ఖేద్కర్ ఇంతటితో ఆగకుండా అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆమె ఆంటీ-ఛాంబర్ను కూడా ఆక్రమించి తన పేరుతో బోర్డు పెట్టుకున్నారు. అనంతరం ఆమె పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్ప్లేట్, రాజముద్ర, ఇంటర్కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ను ఆదేశించారు. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయిన ఖేద్కర్ తండ్రి కూడా తన కుమార్తె డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చి, చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేయక తప్పలేదు.












Click it and Unblock the Notifications