శివసేన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు-కుటుంబానికి భద్రత తొలగింపుపై షిండే ఫైర్
మహారాష్ట్రలో అధికార శివసేనలో తలెత్తిన తిరుగుబాటు రోజుకో మలుపు తిరుగుతోంది. గౌహతిలో క్యాంపు వేసి రెబెల్ ఎమ్మెల్యేలను గుప్పిట్లో ఉంచుకున్న ఏక్ నాథ్ షిండే ముంబై వచ్చేందుకు భయపడుతుండగా.. ఇదే అదనుగా శివసేన దాడుల్ని ముమ్మరం చేసింది. శివసేన కార్యకర్తలు, నేతలు రెబెల్స్ ఇళ్లు, ఆపీసులపై దాడులకు దిగుతున్నారు.
పూణేలోని కత్రాజ్లోని బాలాజీ ప్రాంతంలో శివసేన పార్టీ రెబెల్ ఎమ్మెల్యే తానాజీ సావంత్ కార్యాలయాన్ని ఇవాళ శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. సావంత్ రాష్ట్రంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరు. ప్రస్తుతం ఈఆయన అస్సాంలోని గౌహతిలో క్యాంప్ లో ఏక్ నాథ్ షిండేతో పాటు ఉన్నారు. ఇదే కోవలో మరికొందరు రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపైనా శివసేన కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీంతో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేల నేత అయిన ఏక్ నాథ్ షిండే ఇంటికి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం భద్రతను తొలగించింది.
తన ఇంటికి భద్రత తొలగించడంపై గౌహతి క్యాంపులోనే ఉన్న ఏక్ నాథ్ షిండే మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే సర్కార్ కక్షసాధింపులకు దిగుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రమే భద్రత కల్పిస్తోందని, వారి కుటుంబ సభ్యులకు కాదని రౌత్ వెల్లడించారు.
ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెడితే ఆగ్రహంతో వారు దాడులు చేసినా చేస్తారని హౌత్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారు ముంబైలో అడుగుపెట్టేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నేతల నుంచి వారి భద్రతపై హామీ లభిస్తోంది.