అది చట్టవ్యతిరేకమే.. పరువు హత్యలపై సుప్రీం సీరియస్, కేంద్రానికి నోటీసులు!
న్యూఢిల్లీ: కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతీయువకులపై సొంతవారే దాడులకు పాల్పడుతున్న ఘటనల్ని మనం చూస్తూనే ఉన్నాం. పరువు పేరుతో హత్యలకు సైతం వెనుకాడని ఘటనలు ఇంకా మన దేశంలో జరుగుతున్నాయి.
మరికొన్ని చోట్లయితే అలా పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఖాప్, సాధారణ పంచాయతీలు తీవ్రమైన శిక్షలు విధిస్తుంటాయి. అయితే అలా చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.
మేజర్ అయిన అమ్మాయి లేదా అబ్బాయి కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటే వారిని ఖాప్, పంచాయతీ, వ్యక్తులు లేదా సమాజం ప్రశ్నించకూడదని స్పష్టంచేసింది.
పరువు పేరుతో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిపై జరిగే దాడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ 2010లో ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఘటనల్లో న్యాయసలహా కోరుతూ అమికస్ క్యూరీని కూడా నియమించింది. సదరు అమికస్ క్యూరీగా ఉన్న రాజు రామచంద్రన్ తాజాగా నివేదిక సమర్పించారు.
దీనిపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఖాప్, పంచాయతీలకు మొట్టికాయలు వేసింది.
'ఓ మేజర్ అయిన అబ్బాయి లేదా అమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటే వారిపై ఖాప్ లేదా పంచాయతీలు సామూహికంగా దాడి చేయడం కచ్చితంగా చట్టవ్యతిరేకమే. అలా పెళ్లి చేసుకున్నవారిని పంచాయతీలు, వ్యక్తులు ప్రశ్నించకూడదు..' అని స్పష్టం చేసింది.
అంతేగాక.. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ చేసిన సూచనలపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే.. అమికస్ క్యూరీ చేసిన సూచనల ప్రకారం ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.