కాంగ్రెస్కు మోడీ సవాల్: గాంధీయేతర కుటుంబానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వండి
Recommended Video
ఛత్తీస్గఢ్: గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరొకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలకు ప్రధాని మోడీ సవాల్ విసిరారు. ఛత్తీస్గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అంబికాపూర్లో ప్రసంగించారు. ప్రధాని నెహ్రూ వల్లనే ఓ ఛాయ్వాలా దేశానికి ప్రధాని కాగలిగారని కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్పై ఆయన స్పందించారు. తొలిదశ ఎన్నికలలో బస్తర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొని మావోయిస్టులకు సరైన సమాధానం ఇచ్చారని ప్రధాని కొనియాడారు.
ఛాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారన్న నిజాన్ని జీర్ణించుకోలేకున్నారు
ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబికాపూర్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై మోడీ విమర్శలు గుప్పించారు. ఒక ఛాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యాడన్న నిజాన్ని కాంగ్రెస్ వారు ఇంకా జీర్ణించుకోలేకున్నారని ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు దేశానికి ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రధానిగా తనను ఎన్నుకుంది దేశ ప్రజలని, అదేదో నెహ్రూ వల్లే తను ప్రధాని అయ్యానని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నెహ్రూ ప్రవేశ పెట్టిన ప్రజాస్వామ్య విలువల వల్లే ఛాయ్ వాలా కూడా ప్రధాని కాగలిగారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది కాబట్టే ఒక ఛాయ్వాలా కూడా ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు.
గాంధీ కుటుంబం కాకుండా మరో వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయండి
"పండిట్ నెహ్రూ వల్లే ఒక ఛాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారని కాంగ్రెస్ వారు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవిస్తే గాంధీ కుటుంబం కాకుండా బయటి వ్యక్తికి కాంగ్రెస్ పదవి అప్పగించాలని అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తుందని నేను నమ్ముతాను" అని మోడీ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి కాంగ్రెస్ ఛీఫ్ కాగలిగితే కాంగ్రెస్ అన్నట్లు నెహ్రూ గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొచ్చారని ఒప్పుకుంటానని మోడీ అన్నారు. కాంగ్రెస్ ఛీఫ్గా 90వ దశకంలో సీతారాం కేసరి అయ్యారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పూర్తిగా ఐదేళ్లు కొనసాగలేకపోయారు. సెప్టెంబర్ 1996 నుంచి మార్చి 1998 వరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. దీన్ని ఉద్దేశించే ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
దశాబ్దాలుగా దేశాన్ని చీకటిలోకి నెట్టేసిన కాంగ్రెస్
ప్రజాస్వామ్యం పరిరక్షణ కేవలం ఒక కుటుంబానికే కాంట్రాక్టు ఇవ్వలేదన్నారు మోడీ. గాంధీ అనే పేరు వాడకుండా వారు అధికారంలోకి రాలేరని... కానీ మోడీ అనే వ్యక్తి ప్రజల ఆశీస్సులతో ప్రధాని కాగలిగాడని చెప్పారు. ఇప్పటికీ ఒక ఛాయ్వాలా దేశానికి ప్రధాని అవడాన్ని జీర్ణించుకోలేక ప్రతి నిమిషం వేదన చెందుతున్నారని మోడీ తనదైన శైలిలో అన్నారు. ఒక పేద తల్లికి పుట్టిన కొడుకు ఢిల్లీకి రాజు ఎలాగైయ్యాడనే నిజాన్ని వారు నమ్మలేకున్నారని చెప్పారు. ఎర్రకోట నుంచి ప్రసంగించేందుకు ఒకే కుటుంబానికి చెందిన వారు ఇకపై ఉండకూడదని ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. పేద ప్రజల కష్టాలు గాంధీ కుటుంబానికి తెలియదు కానీ... ఒక ఛాయ్ వాలాకు ఆ కష్టాలు ఏమిటో తెలుసన్నారు. ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పి ప్రజలను దశాబ్దాలుగా మభ్యపెట్టారని దేశాన్ని చీకట్లోకి నెట్టివేశారని మోడీ ధ్వజమెత్తారు.