రాహుల్ కాదు: కాంగ్రెస్ లోకసభ పక్ష నేతగా ఖర్గే
న్యూఢిల్లీ: లోకసభలో కాంగ్రెస్ పక్షనేతగా మాజీ రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే(70) వ్యవహరిస్తారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది ఈ విషయాన్ని ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభ పక్షనేతగా వ్యవహరిస్తారని వార్తలు వస్తుండగా కాంగ్రెస్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది.
మరో మాజీ కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్.. లోకసభ పక్షనేతగా ప్రకటిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మల్లిఖార్జున ఖర్గేను ప్రకటించి ఊహాగానాలకు తెరదించింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ 44 పార్లమెంటు సభ్యుల్లో మల్లిఖార్జున ఖర్గే సీనియర్ కావడంతో ఆయననే కాంగ్రెస్ పక్ష నేతగా ప్రకటించినట్లు తెలుస్తోంది. యూపిఏ-2 ప్రభుత్వంలో ఖర్గే రైల్వే మంత్రిగా పని చేశారు.
మల్లిఖార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్లలో ఈయనొక ప్రముఖ దళిత నేత. అంతేగాక కర్ణాటక అసెంబ్లీకి 9సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2009లో లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా గుల్బర్గా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications