'మహా'లో తెలుగువ్యక్తి గెలుపు, హుధుద్: మోడీపై నితీష్
ముంబై: మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి ఒకరు గెలుపొందారు. ద్వారంపూడి మల్లికార్జున రామిరెడ్డి రామ్టెక్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ముప్పర్తిపాడు గ్రామానికి చెందిన సూర్య భాస్కర రెడ్డి అల్లుడు.
గుత్తేదారు అయిన మల్లికార్జున రామిరెడ్డి రామ్టెక్ ప్రాంతంలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా స్థానికులకు సేవలు అందిస్తున్నారు. అక్కడి ప్రజలతో అతను మమేకమయ్యాడు. ఈ కారణంగానే అతను గెలుపొందాడని చెబుతున్నారు.
మోడీ ఒక హుధుద్ తుఫాన్: నితీశ్ కుమార్
మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ హవా పైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విభిన్నంగా స్పందించారు. లభించింది. మోడీ హవాను ఆయన హుధుద్తో పోల్చారు. అయితే విధ్వంసం ఉన్నా, భయపడాల్సింది ఏమీ లేదన్నారు.
మోడీ ప్రాబల్యాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సునామీతో పోల్చారు. దీనిపై నితీష్ కుమార్ ఎగతాళి చేశారు. ఒకప్పుడు మోడీ హవాను బ్లోయర్ నుంచి వచ్చే గాలితో నితీశ్ పోల్చారు. ఆయనే ఇప్పుడు మోడీని ఒక ప్రభంజనమని ఒప్పుకోవడంతో మోడీ ప్రభంజనాన్ని ఏదో ఒక మేరకు నితీశ్ అంగీకరించినట్లయిందంటున్నారు.
బీజేపీ - శివసేన పొత్తు ఉంటే...
పొత్తుల కత్తులు ఎవరికి నష్టం చేశాయి? ఎవరిని ఎంతగా దెబ్బతీశాయి? కలిసుంటే ఎవరికి మేలు జరిగేది? త్రిశంకు సభ ఏర్పడిన మహారాష్ట్రలో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన ప్రశ్నలివి. చిరకాల మిత్రులైన బీజేపీ-శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీలు ఈసారి పొత్తుకు కటీఫ్ చెప్పుకొని దేనికవిగా పోటీ చేశాయి. దాంతో ఓట్ల చీలిక భారీగా జరిగి ఏ పార్టీకీ విస్పష్ట మెజార్టీ రాని పరిస్థితి నెలకొంది.
బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేజిక్ మార్కు 145 కంటే కాస్త దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడొచ్చిన ఫలితాలను చూస్తే బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసి ఉంటే ఆ కూటమి మేజిక్ మార్క్ను అలవోకగా దాటేసి ఉండడమేకాక తిరుగులేని మెజారిటీ సాధించేదని గణాంకాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్, ఎన్సీపీలు విజయం సాధించిన ఒక్కో స్థానంలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను తరచి చూసినప్పుడు ఈ సంగతి స్పష్టమవుతోంది. కలిసి పోటీ చేస్తే కాషాయ కూటమికి కనీసం మరో 35 సీట్లు వచ్చేవంటున్నారు. అలా శివసేనకు కూడా భారీగా లాభం కలిగేదని చెబుతున్నారు.