కరోనా విలయం: హిందూ-ముస్లిం తేడాలు.. రోగానికి, రక్తానికి మతం ఉంటుందా? కేజ్రీవాల్ ఏమన్నారంటే..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో కరోనా మహమ్మారికి మతం రంగులు అద్దుతున్నారంటూ ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో మర్కజ్ ప్రార్థనలు మొదలుకొని, మొన్నటి పాల్ఘర్ మూకదాడి ఘటన వరకు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా ప్రకటనలు చేయడం, బీజేపీ ఎంపీలైతే ఏకంగా ముస్లిం మహిళల సెక్స్ విషయాలనూ ఇందులోకి చొప్పించడం వివాదాస్పమయ్యాయి. ఈలోపే, రాజకీయ కుట్రల్ని పటాపంచెలు చేస్తూ, రెండు మతాలకు చెందినవాళ్లు రక్తదానానికి ముందుకురావడం, తద్వారా ఎంతోమంది కొవిడ్-19 రోగుల ప్రాణాలు నిలబడటం గమనార్హం.
కొవిడ్-19 చికిత్సలో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తుండటంతో రక్తదానాల అవసరత పెరిగింది. సాధారణ వ్యక్తుల కంటే కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలోని ప్లాస్మానే పనికొస్తుందని డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటికే కోలుకున్నవాళ్లలో కొందరు రక్తదానం చేయగా, మరింత మంది ముందుకు రావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దేశంలో నమోదైన కేసుల్లో మెజార్టీ వాటా మర్కజ్ కు సంబంధించినవే కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మతాలకు అతీతంగా ప్లాస్మా దానాల కార్యక్రమం కొనసాగాలని ఆయన కోరారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్స్ చేశారు.
''కరోనా విలయ కాలంలో మనందరం మతాలను పక్కనపెట్టాలి. హిందువుల రక్తంతో ముస్లింల ప్రాణాలు నిలబడొచ్చు లేదా ముస్లింల రక్తదానంతో హిందూ పిల్లలు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.. రోగానికి, రక్తానికి మతాలతో సంబంధం లేదు. ఒక వర్గం వాళ్లకే కరోనా వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. కొవిడ్-19 నుంచి కోలుకున్నవాళ్లంతా ప్లాస్మా దానాలు చేయండి..''అని కేజ్రీవాల్ కోరారు.
Recommended Video
ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తామని, ఇళ్లమధ్య దుకాణాలు తప్ప మాల్స్, మార్కెట్లను రీఓపెన్ చేయబోమని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, సీఎం ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ.. మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడగించాలని సూచించినట్లు ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఢిల్లీలోని మొత్తం 11 జిల్లాల పరిధిలో 95 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం నాటికి అక్కడ కేసుల సంఖ్య 2625గాను, మరణాల సంఖ్య 54గానూ ఉన్నది.