66 ఏళ్ల ముసలి ఆంటీ! అలాంటి మాటలా?: మమతా బెనర్జీపై సువేందు అధికారి తీవ్ర వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత, నందిగ్రాం ఎమ్మెల్యే అభ్యర్థి సువేందు అధికారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెకు వయసైపోయిందని, మురికి భాషను వాడటం తగ్గించుకోవాలని సువేందు హెచ్చరించారు.
చర్చనీయాంశంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు
అంతేగాక, మమతా బెనర్జీకి ఇప్పుడు 66 ఏళ్లు అని, ఆమెను అంటీ అంటూ సంబోధించారు. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. ప్రస్తుతం నందిగ్రాంలో మమతా బెనర్జీతో పోటీకి దిగిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని రక్షించడానికి మే 2న ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా కేంద్ర బలగాలు రాష్ట్రంలో భద్రత నిర్వహించాల్సి ఉంటుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపై ధీటుగా స్పందించారు సువేందు అధికారి.
ముఖ్యమంత్రిగా నిగ్రహం ఉండొద్దా.. ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలా?
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఘోరమైన ఓటమి తప్పదని సువేందు అధికారి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యల చేయడం తగదని హితవు పలికారు. 'ఓ ముఖ్యమంత్రిగా ఆమె కొంత నిగ్రహం పాటించాలి. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఆమె అసభ్య పదజాలం ఉపయోగించారు. ఆమె 66 ఏళ్ల ముసలి ఆంటీ' అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ కూడా ఇక్కడేవుంటారు.. బెంగాల్ కూడా భారతదేశంలో ఓ భాగమేనని అన్నారు.
మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘించారు.. ఆమె ప్రయత్నాలు ఫలించవు
ఎన్నికల ప్రచారం ముగిసినా మీడియాతో మాట్లాడి కోడ్ ఉల్లంఘించారని మమతా బెనర్జీపై సువేందు అధికారి మండిపడ్డారు. మమతా బెనర్జీ చట్ట విరుద్ధంగా మీడియాతో ప్రసంగించారు. హుగ్లీలో కూడా ఆమె నందిగ్రామ్ పేరు ప్రస్తావించారు. ఆ తర్వాత హెలిప్యాడ్లో నందిగ్రాంపై ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడారని సువేందు చెప్పారు.
నందిగ్రాం ఓటర్లను ప్రభావితం చేయడానికి మమత చేసిన ప్రయత్నాలు ఫలించవని సువేందు అధికారి వ్యాఖ్యానించారు.
నందిగ్రాంలో రీపోలింగ్ అవకాశం రాదు..
నందిగ్రాంలో రీపోలింగ్ అవకాశం రాదని, అందరూ అంతా అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. కేంద్ర బలగాలు, 14 డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారని, 76 బూత్ లలో క్విక్ రెస్పాన్స్ టీంలు, ఇతర దళాలను ఉంచారని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని, అంతా ప్రజలకే వదిలేయాలని సువేందు అధికారి చెప్పుకొచ్చారు. కాగా, గురువారం సువేందు అధికారి వాహనంపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. ఈ దాడి టీఎంసీ గూండాల పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం నందిగ్రాంతోపాటు పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.