మమత పైన గుజరాత్ పైచేయి!: బెంగాల్ కంటే ఒక్కరోజే పదిరెట్లు
న్యూఢిల్లీ: ఉజ్వల గుజరాత్ సదస్సు రెండో రైజోన సోమవారం పెట్టుబడుల వరద పారింది. రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో కుదిరిన పెట్టుబడుల ప్రణాళికలతో పోలిస్తే ప్రస్తుత ఉజ్వల గుజరాత్ రెండోరోజు ప్రకటించిన పెట్టుబడులు పది రెట్లు అధికం.
బెంగాల్లో జరిగిన సదస్సుకు ఇరవై దేశాల నుండి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు వచ్చారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. 2.43 లక్షల కోట్ల మేర ఎంవోయులు కుదిరాయి. అదే వైబ్రాంట్ గుజరాత్లో రూ.25 లక్షల కోట్లకు 21,000 ఎంవోయులు కుదిరాయి.
వైబ్రాంట్ గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులతో పాటు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ తదితరులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోడీ బెంగాల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బిజినెస్ సమ్మిట్ పైన మాట్లాడుతూ.. గుజరాత్ నిర్వహించిన ఈ సదస్సుకు మంచి ఆదరణ లభిస్తోందని, దీనిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని అన్ని రాష్ట్రాలకు కేంద్రం అండ ఉంటుందని చెప్పారు.
కాగా, ఉజ్వల గుజరాత్ సదస్సు రెండో రోజైన సోమవారం పెట్టుబడుల వరద పారింది. దేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 21 వేల ఎంవోయులు కుదుర్చుకున్నాయి. గత సదస్సుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. 2013లో 17 వేల ఎంఓయులతో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. కంపెనీల్లో ఆర్ఐఎల్, బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, సుజ్లాన్, వీడియోకాన్ తదితర దిగ్గజాలున్నాయి.