తృణమూల్ భారీ ప్రక్షాళన..! రెబెల్స్ కు మమత ఫుల్ క్లారిటీ..!
పశ్చిమ బెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కాళీఘాట్లోని తన అభ్యర్థులతో సమావేశమయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో జరిగిన ఈ భేటీలో, పార్టీని పునర్నిర్మించాలని, వెళ్లాలనుకునేవారికి స్వేచ్ఛనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు. టీఎంసీ అధికారానికి దూరమై ప్రతిపక్షానికి పరిమితమైన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.
ఇతర పార్టీల్లో చేరాలనుకునేవారు వెళ్లిపోవచ్చని, తాను పార్టీని కొత్తగా నిర్మిస్తానని మమత తెలిపారు. పార్టీలో ఉండేవారు దెబ్బతిన్న కార్యాలయాలను పునర్నిర్మించి, రంగులు వేసి తిరిగి తెరవాలని ఆదేశించారు. కావాలంటే తాను కూడా రంగులు వేయడానికి సిద్ధమన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటికీ తలవంచదని, ప్రజల తీర్పు దొంగిలించారని పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ కేవలం 80 మాత్రమే గెల్చుకోగా.. మమతా బెనర్జీ స్వయంగా తన రాజకీయ కంచుకోట భవానిపూర్లో ఓటమి పాలయ్యారు.

ఈ వైఫల్యం తర్వాత అంతర్గత అసంతృప్తి, ఫిరాయింపుల ఊహాగానాల మధ్య అభ్యర్థుల మనోధైర్యాన్ని, ఐకమత్యాన్ని చాటేందుకు మమత తాజా సమావేశం నిర్వహించారు. నిజానికి మే 5న జరిగిన ప్రెస్ మీట్లో మమతా బెనర్జీ తమ నాయకులు పార్టీ మారవచ్చని ముందే చెప్పారు."చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్తారని నాకు తెలుసు. వారికి వారి కారణాలు ఉండవచ్చు. నాకు చెప్పడానికి ఏమీ లేదు. వెళ్లాలని అనుకున్నవారు వెళ్లవచ్చు. ఎవరినీ బలవంతంగా ఆపి ఉంచడాన్ని నేను నమ్మను" అని స్పష్టం చేశారు. ఇప్పుడు టీఎంసీ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో సైతం "తృణమూల్ కాంగ్రెస్ ఒకే కుటుంబంగా ఐక్యంగా నిలుస్తుంది. ప్రజల తీర్పును అపహరించిన వారి ముందు మేము ఎప్పటికీ తలవంచము. సత్యమే గెలుస్తుంది." అని తెలిపింది.












Click it and Unblock the Notifications