పోలీస్ స్టేషన్ పేల్చేస్తా: యువనేత హెచ్చరిక
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ఒకరు రెచ్చిపోయాడు. ఆందోళన విరమించుకోమని సూచించేందుకు వచ్చిన పోలీసుల పైన ఒంటి కాలిపైన లేచాడు. వారిని తీవ్రంగా హెచ్చరించాడు.
వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలని లేదంటే పోలీస్ స్టేషన్ పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సౌమిత్రా బెనర్జీ అనే వ్యక్తి టీఎంసీ పార్టీ రాణిగంజ్ బ్లాక్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను విద్యార్థి సంఘంలో సభ్యుడు.
త్రివేణీ దేవి భలోటియా అనే కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి అతడు కొంతమంది విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగాడు. యాజమాన్యం పోలీసులను పిలిపించింది. పోలీసులు కళాశాల ప్రాంగణానికి వచ్చారు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఐదు నిమిషాలు టైమిస్తున్నానని, ఆఫీస్ ఇంఛార్జ్ రావాలని, లేదంటే పోలీసు వాహనం పేల్చేస్తానని, పోలీసు స్టేషన్ పేల్చేస్తానని బెదిరించాడు. అంతేకాదు, తనతో పాటు ఆందోళనకు దిగిన విద్యార్థులను ఉద్దేశించి పోలీసులకు భయపడాల్సిన పని లేదని, వారు ప్రభుత్వ సేవకులు అన్నారు.