మే 5న మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం... గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించిన దీదీ...
బెంగాల్ గడ్డపై ముచ్చటగా మూడోసారి జయకేతనం ఎగరేసిన మమత బెనర్జీ... ఈ నెల 5న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థా చటర్జి ఈ విషయం వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కలిసి మమతను తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వెల్లడించారు.
సోమవారం రాత్రి 7గంటలకు మమతా బెనర్జీ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిశారు. ఆయనకు తన రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యా బలం తమకు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మమతనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ఆమెకు అభినందనలు తెలిపారు.
మే 5న మమత ప్రమాణ స్వీకారం చేయనుండగా... మే 6న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ప్రొటెం స్పీకర్గా బిమన్ బెనర్జీ వ్యవహరించనున్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 292 అసెంబ్లీ స్థానాలకు గాను 213 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నందిగ్రాంలో మమత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఇక బీజేపీ కేవలం 77 స్థానాలకే పరిమితమైంది. అయితే 2016లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.
బెంగాల్ ఎన్నికల్లో ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేయకపోతే ఆ పార్టీకి 50 సీట్లు కూడా దాటేవి కాదని మమత అభిప్రాయపడ్డారు. ఈసీ వ్యవహారంపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామన్నారు. ఇక నందిగ్రాం ఓటమి గురించి పెద్దగా బాధపడాల్సిందేమీ లేదని... రాష్ట్రంలో గెలిచిన సీట్లన్నీ తనవేనని మమత పేర్కొనడం గమనార్హం.
Recommended Video
మమత నందిగ్రాంలో ఓడిపోవడంతో ఆర్నెళ్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవాల్సిన అనివార్యత ఏర్పడింది. లేనిపక్షంలో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుంది.అయితే కొత్త ఎమ్మెల్యే ఎవరితోనైనా రాజీనామా చేయించి మమత అక్కడినుంచి పోటీ చేస్తారా... లేక ఎన్నికలు జరగాల్సిన వున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక చోటు నుంచి పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.