ముచ్చటగా మూడోసారి: నేడు పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం..!
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం (మే 5న) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమె గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించేవరకూ ఆమె కేర్ టేకర్గా వ్యవహరించనున్నారు.
తాజా ఎన్నికల్లో 213 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. 77 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు నమోదు చేసింది. ఎన్నికల్లో విజయం అనంతరం సోమవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకంటే ముందు కరోనాను ఎదుర్కోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తాను ఇప్పుడు ఒంటరిగా పోరాడుతున్నానని, తన వెంట అందరూ కలిసి రావాలని కోరుతున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన టీఎంసీ ఎమ్మెల్యేంతా మమతా బెనర్జీని శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెజార్టీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకున్నప్పటికీ నందిగ్రాం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలోగా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కాగా, బుధవారం కరోనా నిబంధనల మధ్య మమతా బెనర్జీ వరుసగా మూడోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు పలువురు సభ్యులు మంత్రులుగా కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది.
మే 5న ఉదయం 10.45 గంటలకు రాజ్భవన్లో మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులు హాజరుకానున్నారు.
మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా.. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. దేశంలోని రెండు మూడు రాష్ట్రాలకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్లో బీజేపీ కార్యాలయం నుంచే వ్యాక్సిన్ల సరఫరా అవుతున్నాయని ఆరోపించారు.
బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు సున్నా కావడం తనకు ఇష్టం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవారని.. ఈసారి మాత్రం ఆయన ఫోన్ చేయలేదని అన్నారు. అయితే, ప్రధాని ఇతర పనుల్లో బిజీగా ఉండి ఉంటారని, తాను దీన్ని పెద్దగా పట్టించుకోనని అన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా, ఎన్నికల్లో విజయం సాధించిన కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు శుభాకాంక్షలు తెలిపారు.