మోదీపై గెలుపు: దీదీ ఫస్ట్ రియాక్షన్ -ఓటమి అంగీకరించిన బీజేపీ, మమతకు రాజ్నాథ్ విషెస్, కానీ..
ఎన్నడూ లేని విధంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ షెడ్యూల్ ప్రకటించడం నుంచి భారీ ఎత్తున కేంద్ర బలగాల మోహరింపు దాకా మోదీ వర్సెస్ దీదీ అన్నట్లుగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మోదీ-షా లెక్కల్ని తలకిందులు చేస్తూ, ఎగ్జిట్ పోల్ అంచనాలు సైతం తప్పని నిరూపిస్తూ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 294 సీట్లకుగానూ ఏకంగా 210కిపైగా స్థానాలతో తిరుగులేని మెజార్టీ సాధించింది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న బీజేపీ కేవలం 79స్థానాలకే పరిమితమైపోయింది. ఇంతటి ఘన విజయంపై దీదీ తొలిసారి స్పందిస్తూ..

దీదీ ఫస్ట్ రియాక్షన్.. వార్నింగ్..
బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. కానీ, కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గెలుపు సంబురాలపై ఈసీ నిషేధం విధించిన దరిమిలా టీఎంసీ కార్యకర్తలు, నేతల తీరు వివాదాస్పదంగా మారింది. ఆంక్షలు ధిక్కరించిమరీ చాలా చోట్ల టీఎంసీ శ్రేణులు రోడ్లపై సందడి చేశాయి. మోదీపై ఘన విజయం తర్వాత తన తొలి స్పందనలోనే మమత టీఎంసీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు.

ఇది బెంగాల్ గెలుపు..
''ఇది బెంగాల్ ప్రజల గెలుపు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే, ఈ విజయం సందర్భంగా ఎవరూ ఊరేగింపులు చేయొద్దని అభ్యర్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నాను. గెలుపు ఉత్సాహంతో మీమీ ఇళ్లకు తిరిగెళ్లండి..''అని మమత పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ క్లీన్ విక్టరీ సాధించినప్పటికీ, నందిగ్రామ్ స్థానంలో మాత్రం గెలుపు కోసం దీదీ శ్రమించాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ లో చివరికి దీదీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారిపై 1200 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక..

ఓటమి ఒప్పుకున్న బీజేపీ..
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎట్టకేలకు ఓటమి అంగీకరించక తప్పలేదు. అయితే, 200 సీట్లు గెలుస్తామని సవాళ్లు చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండిపోగా, కేంద్రంలో నంబర్ 3అయిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బెంగాల్ ఫలితంపై స్పందించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ సాధించిన విజయానికి శుభాకాంక్షలు అని, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న ఆమెకు నా శుభాకాంక్షలు అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. కాగా, బెంగాల్ లో టీఎంసీ గెలుపు దాదాపు ఖరారైనప్పటికీ, చివరి నిమిషంలోనూ ఫలితాలు మారొచ్చని బీజేపీ నేత దిలీప్ ఘోష్ అన్నారు. చివరి ఫలితం వెలువడేదాకా బీజేపీ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘోష్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications